BRS | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ‘మీ ఆనవాళ్లన్నీ చెరిపేసే జిమ్మెదారి మాది’ అని సీఎం రేవంత్రెడ్డి ఎన్ని గంభీర ప్రకటనలు చేసినా.. ‘గత ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చింది’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాటలు అన్నా.. చివరికి కేసీఆర్ సర్కార్ చేసిన మంచిని ఒప్పుకోక తప్పలేదు. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం అనేకసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిన సంస్కరణ, అభివృద్ధి ఫలాలను వివరించారు. రాష్ట్ర జీఎస్డీపీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.13.02 లక్షల కోట్లుగా ఉండగా, 2023-24కు రూ.14.49 లక్షల కోట్లకు పెరిగినట్టు పేర్కొన్నారు. అంటే ఏడాదిలో రూ.1.47 లక్షల కోట్లు పెరిగింది.
దేశ జీడీపీ వృద్ధి 8.9 శాతం నమోదు కాగా.. తెలంగాణ వృద్ధిరేటు ఏకంగా 11.3 శాతంగా నిలిచింది. జాతీయ సగటు కన్నా 2.4 శాతం ఎక్కువని స్వయంగా ఆర్థిక మంత్రి తెలిపారు. తలసరి ఆదాయంలోనూ ఇదే జోరు కనిపించింది. 2022-23లో రూ.3.09 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం నిరుడు రూ.3.43 లక్షలకు పెరిగినట్టు చెప్పారు. ఏడాది కాలంలో రూ.33,385 పెరిగింది. ఇది 10.7 శాతం వృద్ధి. దీంతోపాటు తయారీ రంగం, రియల్ ఎస్టేట్, నిర్మాణం, మైనింగ్, క్వారీ వంటి రంగాల్లో అధిక వృద్ధిరేటు సాధించినట్టు వెల్లడించారు. ఇదంతా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కూడా ప్రభుత్వం పొగిడింది. రైతులకు పెట్టుబడి సాయం అందించడం ప్రశంసనీయం అని పేర్కొన్నది.