Assembly | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 13 వరకు కొనసాగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ శుక్రవారం జరుగనున్నది. 10న బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా, దానిపై చర్చను 12న చేపట్టనున్నారు. 13న ద్రవ్య వినిమయ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. శాసనమండలిలో జరిగిన బీఏసీ సమావేశానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షత వహించగా, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నుంచి టీ జీవన్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ, బీజేపీ నుంచి ఏవీఎన్ రెడ్డి, ఎంఐఎం నేత ఇఫెండీ పాల్గొన్నారు.
బీఏసీ సమావేశంలో హైడ్రామా నడిచింది. సమావేశానికి తాను హాజరుకాలేకపోతున్నాని, తన బదులుగా పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్రావు, బీఏసీ సభ్యుడిగా ఉన్న కడియం శ్రీహరి హాజరవుతారని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు బుధవారమే ఫోన్చేసి చెప్పారు. ఇందుకు స్పీకర్ కూడా సరే అన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. దీంతో బీఆర్ఎస్ సభ్యులు హరీశ్రావు, కడియం శ్రీహరి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. దీనికి మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో బీఏసీ సభ్యులు హాజరుకాకుంటే వారి స్థానంలో అదే పార్టీకి చెందిన మరొకరు హాజరయ్యేవారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో అనేకమార్లు అలా జరిగిందని, ఆ ఉదంతాలను హరీశ్రావు స్పీకర్కు గుర్తుచేశారు. కావాలంటే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ను అడిగి తెలుసుకోవచ్చని చెప్పారు.
అక్బరుద్దీన్ ఒవైసీ కూడా హరీశ్రావు చెప్పింది నిజమేనని ధ్రువీకరించారు. అయినప్పటికీ స్పీకర్.. హరీశ్రావును బీఏసీ సమావేశానికి అనుమతించలేదని తెలిసింది. స్పీకర్ తన విచక్షణ అధికారంతో మరో సభ్యుడు సమావేశానికి హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకోవచ్చని హరీశ్రావు కోరారు. ‘మీరు వెళ్లమంటే వెళ్లిపోతా.. బీఏసీకి హాజరుకావద్దు అని చెప్పండి.. బయటకు వెళ్తా’ అని హరీశ్రావు చెప్పారు. స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హరీశ్రావు బీఏసీ సమావేశానికి హాజరుకాలేకపోయారు. హరీశ్రావు బయటకు వెళ్లే వరకు సీఎం రేవంత్రెడ్డి బీఏసీ సమావేశానికి హాజరుకాలేదు.
బీఏసీ సమావేశం ప్రారంభంలోనే హరీశ్రావు హాజరు విషయమై వాడివేడి చర్చ జరిగింది. సభను మరో ఆరు రోజులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. అనంతరం షెడ్యూల్ను వివరించారు. సభను కనీసం 12 రోజులైనా నిర్వహించాలని కడియం శ్రీహరి కోరారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోసారి బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుందామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.