హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రానున్న ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఎవరికీ కేటాయించవద్దని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. 2011లో ఎన్నికల సంఘం తొలగించిన రోడ్డురోలర్ గుర్తును తిరిగి చేర్చడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ గుర్తును తొలగించాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్కుమార్, ఎంపీలు వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్రెడ్డి బృందం ఎన్నికల అధికారికి రెండు వేర్వేరు వినతిపత్రాలను అందజేసింది.
ఎన్నికల్లో కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు కారును పోలిన రోడ్డురోలర్కు పడుతున్నాయని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆ గుర్తును 2011లో తొలగించింది. ఇటీవల యుగతులసి పార్టీకి రోడ్డురోలర్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దీనిపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, నిరక్షరాస్యులు, వృద్ధులైన ఓటర్లు రోడ్డురోలర్ను కారు గుర్తుగా పొరబడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది.
గతంలో జరిగిన ఎన్నికల్లో రోడ్డురోలర్ గుర్తుకు పోలైన ఓట్ల వివరాలను ఉదహరించింది. గతంలో కే శివకుమార్ అనే వ్యక్తి వైఎస్సార్సీపీని రిజిస్టర్ చేసి, ఆ తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అప్పగించిన విషయాన్ని గుర్తుచేసింది. అదే శివకుమార్ ఏర్పాటు చేసిన యుగతులసి పార్టీ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తింపులేని రాజకీయ పార్టీ కాబట్టి ఆ పార్టీకి రోడ్డురోలర్ గుర్తును కేటాయించకూడదని విన్నవించింది.
కారును పోలిన గుర్తులను తొలగించండి
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పోలిన గుర్తులను కేటాయించకూడదని బీఆర్ఎస్ భారత ఎన్నికల సంఘాన్ని కోరింది. కెమెరా, చపాతీరోలర్, దోడి, రోడ్డురోలర్, సోప్డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్ వంటి గుర్తులు ఈవీఎంల్లో కారు గుర్తును పోలినట్టు ఉన్నాయని, వీటిని రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయింకూడదని విజ్ఞప్తి చేసింది. గతంలో ఈ గుర్తులపై పోటీచేసిన అభ్యర్థులకు జాతీయ పార్టీల నుంచి పోటీచేసిన అభ్యర్థుల కన్నా అధిక ఓట్లు వచ్చిన వైనాన్ని ఆధారాలతో వివరించింది.
ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులకు ప్రయోజనం కలగొద్దు: బీఆర్ఎస్ నేతలు
ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులకు ప్రయోజనం కలుగకూడదనే ఉద్దేశంతోనే కారు గుర్తును పోలిన గుర్తును వచ్చే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకూడదని భారత ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్కుమార్, ఎంపీలు వెంకటేశ్ నేత, మన్నే శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఎన్నికల సంఘానికి రెండు వేర్వేరు వినతిపత్రాలు అందజేసిన అనంతరం సోమా భరత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తమ విజ్ఞప్తి మేరకు రోడ్డురోలర్ గుర్తును తొలగించిన ఎన్నికల సంఘం.. ఇటీవల యుగతులసి పార్టీకి కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశామని చెప్పారు. ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందని రాజకీయ పార్టీకి కామన్ సింబల్ కేటాయించవద్దనే ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే తాము విజ్ఞప్తి చేశామని స్పష్టం చేశారు.