హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే దిశగా శాసనసభలో ప్రైవేట్బిల్లు పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఆరు గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం చెప్తున్నదానికి చట్టబద్ధత లేదని, శాసనసభలో ‘అభయ హస్తం బిల్లు’ పేరుతో తాము ప్రవేశపెడుతామని, ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు శాసనసభ స్పీకర్ను కోరారు.
ఈ మేరకు ఆయన సోమవారం శాసనసభలో పార్టీ శాసనసభాపక్షంతో కలిసి వెళ్లి స్పీకర్ను అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీగా ప్రకటించి, గవర్నర్ ప్రసంగంలో కూడా పలు సందర్భాల్లో పేర్కొన్న హామీలను అమలు చేయించేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని, 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపరిచే దిశగా కొత్త బిల్లు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇది అత్యంత కీలకమైన బిల్లు అని, ప్రైవేట్ మెంబర్ బిల్లును ఆమోదించుకునే దిశగా అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.
1986లో చట్టంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు
ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో ప్రైవేట్ మెంబ ర్ బిల్లులకు ఒక విశేషం ఉన్నది. ఐపీసీ 494-బైగామీ చట్ట సవరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. భార్య ఉన్నప్పుడు మరో స్త్రీని వివాహం చేసుకుంటే గతంలో చట్ట ప్రకారం పెద్దగా శిక్షలుండేవి కావు. బెయిల్ సులువుగా వచ్చేది. అలాంటి పరిస్థితిని నిర్మూలించేందుకు 1986లో ఆనాడు బీజేపీ శాసనసభ్యుడిగా ఉన్న సీహెచ్ విద్యాసాగర్రావు (మహారాష్ట్ర మాజీ గవర్నర్) ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉండేవారు. ప్రైవేట్ మెంబర్ బిల్లును చెన్నమనేని విద్యాసాగర్రావు ఇచ్చిన తర్వాత దానిపై శాసనసభలో చర్చించారు. నాటి టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించింది. శాసనసభలో ఆమోదం పొందడమేకాకుండా రాష్ట్రపతి ఆమోదం కూడా పొంది ఆ తర్వాత చట్టమైంది. ఈ చట్టం దేశంలో అనేక సంస్కరణలకు దారితీసింది.
ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సహకరించాలి
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సహకరించాలని ఎన్నారై బీఆర్ఎస్ యూకే నాయకులు అనిల్ కూర్మాచలం, నవీన్రెడ్డి కోరారు. సోమవారం లండన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చే స్తున్నదని మండిపడ్డారు. నాయకులు అశోక్గౌడ్ దుసారి, రత్నాకర్ కడుదుల, సిక్కా చంద్రశేఖర్గౌడ్, సత్యమూర్తి చిలుముల, హరిగౌడ్ నవపేట్, రవిప్రదీప్ పులుసు పాల్గొన్నారు.
క్రాప్హాలిడే కాలంలో నష్టపరిహారం ఇవ్వాలి.. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
సింగూరు డ్యామ్ పరిధిలోని రైతులకు క్రాప్హాలిడే కాలానికి నష్టపరిహారం చెల్లించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం డ్యామ్ మరమ్మతులు జరుగుతున్నాయని, దీంతో రెండేండ్లపాటు క్రాప్హాలిడే ప్రకటించగా, నష్టపోయే రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. ఘనపూర్ రిజర్వాయర్ ఆనకట్ట ఎత్తు పెంచే పనుల్లో తట్టెడుమట్టి ఎత్తలేదని ఆరోపించారు. ఈ రిజర్వాయర్ భూసేకరణలో రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంలో అందోల్ నియోజకవర్గ రైతులకు పరిహారం ఇచ్చారని, నర్సాపూర్లో మాత్రం పరిహారం ఇవ్వలేదని వాపోయారు. ఎస్సారెస్పీ డీబీఎం 60 కాలువ మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ డిమాండ్ చేశారు. ఈ కాలువ ఎండిపోవడంతో చెరువుల ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితిలేదని పేర్కొన్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతు న్నారని తెలిపారు. బయ్యన్నవాగులోకి నీళ్లు వదలాలని, రూ.వెయ్యికోట్లతో వీరభద్రసాగర్ను నిర్మించాలని కోరారు.
అసంఘటిత కార్మికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయండి.. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
రాష్ట్రంలోని అసం ఘటిత రంగ కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో డిమాండ్ చేశారు. షాపులు, షాపింగ్మాల్స్, మార్కెట్ల ల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరం దరిని ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని సూచించారు. ఇన్సూరెన్స్, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఏజెన్సీ వ్యవస్థతో ఉద్యోగులు నష్టపోతున్నారని, కమీషన్లు దండుకుంటున్నా రని ఆరోపించారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా నే జీతభత్యాలు చెల్లించాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.