హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): మహిళా అభ్యుదయానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ అధ్యక్షుడు ఎల్ రూప్సింగ్ ఆధ్యర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మారెపల్లి మాధవి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి కొప్పుల మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందజేస్తున్నదని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు ప్రభుత్వానికి వారధిగా గ్రామైక్య సంఘాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐకేపీ ఉద్యోగులకు గౌరవవేతనాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు.
బ్యాంకింగ్ నెట్వర్క్గా ఎదగాలి: వినోద్కుమార్
మహిళా సంఘాలు బ్యాంకింగ్ నెట్వర్క్గా ఎదగాలని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఐకేపీ వీవోఏలో మహిళల్లో పొదుపును అలవాటు చేసి వారిని ఆర్థిక క్రమశిక్షణలో పెడుతున్న మహిళా సంఘాల నిర్వాహకుల పాత్ర చాలా గొప్పదని ప్రశంసించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి పీ నారాయణ, యూనియన్ నేతలు మచ్చేందర్, తిరుపతి, కోటేశ్వర్, మొయినొద్దీన్, శోభారాణి, రమేశ్, రాధ, మంజుల, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.