పెగడపల్లి, మార్చి 19: పురుగుల మందు తాగి తండ్రి ఆత్మహత్య చేసుకోగా, ఆ ఇద్దరు కవలలు పుట్టెడు దుఃఖంలోనూ పదోతరగతి పరీక్ష రాశారు. ఈ విషాదకరమైన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లిలో చోటుచేసుకున్నది. బతికపల్లికి చెందిన గాజె చంద్రయ్య మూడు రోజుల క్రితం పురుగులమందు తాగాడు. జగిత్యాల దవాఖానలో చికిత్సపొందుతూ, సోమవారం రాత్రి మృతిచెందాడు.
చంద్రయ్యకు ఇద్దరు కవలలైన కొడుకులు రాము, లక్ష్మణ్ స్థానిక జడ్పీహెచ్ఎస్లో పదోతరగతి చదువుతున్నారు. తండ్రి చనిపోయిన దుఃఖంలో ఉన్నవారికి ఉపాధ్యాయులు, బంధువులు మనోధైర్యాన్ని కల్పించడంతో మంగళవారం వారు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో హిందీ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష పూర్తయ్యాక తండ్రి దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేవరకద్ర, మార్చి 19 : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన నట్టలి అంజమ్మ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రెండో కూతురు జ్యోతి పదో తరగతి చదువుతున్నది. సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభంకాగా.. మంగళవారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సెంటర్లో హిందీ పరీక్షను ఆమె పుట్టెడు దుఃఖంతో రాసింది. అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నది.