సిద్దిపేట : పెండ్లింట విషాదం చోటు చేసుకుంది. వివాహం అయిన మరుసటి రోజే విద్యుత్ షాక్తో వరుడు మృతి చెందిన హృదయ విదారకర సంఘటన జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం వెంకటాపుర్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన నిరంజన్ కుటుంబం సిద్దిపేట పట్టణంలో నివాసం ఉంటున్నది. నిరంజన్ తల్లిదండ్రులకు మొత్తం ఐదుగురు సంతానం. వారిలో నలుగురు అక్కలు కాగా, నిరంజన్ చివరి వాడు. నిరంజన్ సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. రెండురోజుల క్రితం వివాహం జరిగి వధూవరులు ఇంటికి చేరుకున్నారు. కాగా, సోమవారం సాయంత్రం పెళ్లి దావత్ జరగాల్సి ఉంది. సోమవారం ఉదయం 5 గంటలకు ఇంటిపై వేసిన విద్యుత్ దీపాలు వెలగడం లేదని డాబాపైకి వెళ్లిన నిరంజన్, వాటిని సరి చేసే క్రమంలో తీగలు చేతికి తగిలి షాక్ గురై అక్కడిక్కక్కడే మృతిచెందాడు. ఉదయం 6 గంటలు అయినా నిరంజన్ కనిపించకపోవడంతో డాబాపైకి వెళ్లిన కుటుంబసభ్యులకు కిందపడిపోయి విగత జీవిగా కనిపించాడు. ఎంతకీ పైకి లేవకపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. . విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జీవితాంతం తోడుంటానని మూడుముళ్లు వేసిన భర్త అకాలమరణంతో వధువు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది.