Farmer Suicide | సిద్దిపేట, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉన్నదే ఎకరం పొలం. సాగునీళ్లు అందక కండ్ల ముందే యాసంగి పంట ఎండిపోతున్నది. పంటను కాపాడుకోవడానికి అప్పు చేసి బోరు తవ్వించాడు. 750 ఫీట్లు వేస్తేగానీ నీటిబొట్టు జాడ దొరకలేదు. వచ్చిన కొద్దిపాటి నీళ్లతో పంట దిగుబడి ఆశలేదు. ఇది వరకు ఉన్న అప్పులకు, బోరుబావి అప్పులు తోడయ్యాయి. అన్నీ కలిపి తడిసి మోపెడయ్యాయి. సగానికి పైగా మేకలమ్మినా మిత్తీలకే సరిపోయింది. ఇక అసలెట్ల తీరేదీ ? బాకీ ఎట్లా కట్టేదీ ? ఆలోచనలో పడ్డ రైతు.. కుటుంబ సభ్యుల ఎదుటే విషగుళికలు తిన్నాడు. తన పెళ్లిరోజే చావు కౌగిట్లోకి ఒరిగాడు. పెళ్లి రోజే పసుపు కుంకుమలకు దూరమై మానసిక వైకల్యం ఉన్న కొడుకు, 15 నెలల చిన్నారితో భారంగా ఆ తల్లి బతుకీడిస్తున్నది. ఇదీ సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్కు చెందిన ముచ్చర్ల కనకయ్య కుటుంబ కన్నీటి కథ.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం కాన్గల్ గ్రామానికి చెందిన ముచ్చర్ల బాలయ్యకు ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులు సొంతూరులోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. చిన్న కుమారుడు ముచ్చర్ల కనకయ్య(30)కు భార్య వాణి, కుమారుడు సాత్విక్ (7), కూతురు ప్రియాన్షిక (15నెలలు) ఉన్నారు. ఈ కుటుంబానికి ఉమ్మడిగా మూడు ఎకరాల వరకు పొలం ఉంది. రైతు ముచ్చర్ల కనకయ్యకు తన వాటా కింద ఎకరంపైగా భూమి వస్తుంది. అయితే ఆ భూమి కనకయ్య పేరు మీద లేదు. ఉన్నదాంట్లోనే వరి సాగు చేస్తున్నాడు. వ్యవసాయంతో పాటు కూలీ పనికెళ్తూ, ఓ పది మేకలను పెంచుకుంటున్నాడు.
యాసంగిలో పొలం పారకపోయేసరికి బోరు వేయాలనుకున్నాడు. అప్పులు తెచ్చి జనవరి 1న బోరు తవ్వించాడు. నీళ్ల కోసం 750 ఫీట్లకుపైగా బోరు వేయించాడు. అంత లోతుకు వేయడంతో కొద్దిపాటి నీళ్లు వచ్చాయి. మళ్లీ అప్పులు తీసుకువచ్చి బోరుకు మోటరు, పైపులు బిగించారు. మొత్తంగా బోరు కోసం నాలుగు లక్షల అప్పు చేస్తే కొద్దిగా నీళ్లు పోస్తుంది. బోరు వేసి ఇలా రెండు నెలలు గడిసిపోయింది. అంతకు ముందే రెండు లక్షల వరకు అప్పులు ఉన్నాయి. వీటికి బోరు కోసం తెచ్చిన అప్పులు జతకలిశాయి. నెలనెలా మిత్తీలు పెరుగుతున్నాయి. ఉన్న పది మేకల్లో ఆరు అమ్మేసి మిత్తీలు కట్టాడు. ఇక అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాలేదు. చివరికి ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు.
‘ఆ రోజు కనకయ్య పొద్దుగాళ్లే లేచి పొయ్యిమీద ఛాయ్ పెట్టిండు.. పిల్లలకు ఛాయ్ పోసి.. తానూ తాగి పొలానికెళ్లిండు. పొలం పనులు చూసుకొని ఇంటికొచ్చేసరికి నేను బట్టలు ఉతుకుతున్న’ అంటూ ఆరోజు జరిగిన ఘటనను కండ్లలో నీళ్లు తీసుకుంటూ వివరించింది కనకయ్య భార్య వాణి. ‘ఇంట్లో ఎవ్వరితోనూ మాట్లాడలే.. ఉడికిన బువ్వ పళ్లెంల పెట్టుకుని తిన్నడు. ఓ బీడీ ముక్క తాగుతూ ఆలోచనలో పడ్డడు. ఇంటి నుంచి వెళ్తూ.. మళ్లత్తా అని జెప్పి బయటకు పోయి…విషగుళికలు తెచ్చుకున్నాడు. నామనస్సు ఏం బాగాలేదు.. పిల్లలు జాగ్రత్త.. అని నాకు చెబుతూనే వెంట తెచ్చుకున్న విషగుళికల ప్యాకెట్ ఇప్పి వాకిట్లోనే నోట్లో వేసుకున్నడు’ అని గోడు వెళ్లబోసుకున్నది.
‘అయ్యో .. ఎంతపని జేస్తివి’ అంటూ భోరున విలపిస్తూ నేను మా కుటుంబసభ్యులు, ఇంటి పక్కల వాళ్లు కలిసి కనకయ్యను అంబులెన్స్లో సిద్దిపేట పెద్ద దవాఖానకు తరలించాం. అక్కడ మూడురోజులు మృత్యువుతో పోరాటం చేసి మార్చి 3న జీవిడిశిండు అని కనకయ్య భార్య విలపిస్తూ తెలిపింది. ఇదే రోజు వారి పెండ్లిరోజు. తొమ్మిదో ఏట పడుతున్న పెళ్లిరోజునే వాళ్లింట్లో చావు డప్పు మోగింది. మిగిలిన నాలుగు మేకలు అమ్మి దినవారం చేశామని కనకయ్య భార్య వాణి గొల్లుమని ఏడ్చింది. కుమారుడు సాత్విక్కు మానసిక వైకల్యం ఉందని, 15 నెలల చిన్నపాపను సాకేదెట్లా అని ఆమె కన్నీరు కార్చింది. ఓ చిన్న అర్ర, ముందట రేకులు మాత్రమే ఉన్న ఆ ఇంట్లో బతికేదెట్లా ? అంటూ బోరుమన్నది.
కనకయ్యకు ఉన్న ఎకరం పొలం.. ఆయన తండ్రి పేరు మీదనే ఉన్నది. దీంతో కనకయ్యకు రైతు బీమా సాయం రాలేదు. కనకయ్య చనిపోయి నెల దాటినా ఆ కుటుంబాన్ని ఓదార్చేవారే కరువయ్యారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు కనీసం పలుకరించలేదు. పుట్టెడు కష్టాల్లో ఉన్న వాణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.