యాదగిరిగుట్ట, మార్చి 12 : యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి బ్రహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు గరుత్మంతుడిని వియుక్తం చేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం చేపట్టారు. ప్రధానాలయం ముఖ మండపంలో ధ్వజస్తంభంపై ధ్వజారోహణం, అష్టదిగ్పాలక బలిహరణ కార్యక్రమా లు చేపట్టారు.
గరుత్మంతుడి పటాన్ని శ్వేత ధ్వజ పతాకంపై చిత్రించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహణం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించారు. స్వామివారిని పెండ్లి కొడుకును చేసి 33 కోట్ల దేవతలు, 33 కోట్ల పితృదేవతలు, 33 రాగాలు, 33 తాళాలు, 33 వేదమంత్రాలతో భూలోకానికి ఆహ్వానించారు. లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భగవానుడిని వేడుకుంటూ ఈ పర్వాలు నిర్వహించారు.