హైదరాబాద్ : మిషన్-12 పేరుతో గిరిజన నియోజకవర్గాలను గెలుచుకుంటామని రాష్ట్ర బిజెపి నేతలు పగటి కలలు కంటున్నారని, గెలుచుకోవడం కాదు కదా కనీసం గిరిజన ప్రాంతాల్లో డిపాజిట్లు కూడా వీరికి రావని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో దళితులు, గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగింది బిజెపి పాలనలోనే అన్నారు. రాజ్యాంగ పరంగా వచ్చిన రిజర్వేషన్లను కొల్లగొట్టే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న బిజెపికి దళిత, గిరిజనుల గురించి మాట్లాడే కనీస హక్కు లేదన్నారు.
ఎన్నికల ముందు ఓటు బ్యాంక్ రాజకీయంగా గిరిజనులను చూస్తే సహించేది లేదన్నారు. నిజంగా గిరిజనులపై ప్రేమ ఉంటే తెలంగాణ అసెంబ్లీలో గిరిజనుల జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ఆమోదింప చేయాలన్నారు.
గిరిజనుల విశ్వవిద్యాలయం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, జీవో-3 పునరుద్ధరణం, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టానికి గడువు పొడగించి గిరిజనుల గురించి మాట్లాడాలని, లేకపోతే గిరిజన గూడాలు, తండాల్లో తిరగకుండా ప్రజలే అడ్డుకునే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.
బీజేపీ నేతలకు సవాల్ విసురుతున్నాను. గిరిజనులకు బిజెపి చేసిన మేలు ఒక్కటుంటే చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు రవీంద్రనాయక్, హరిప్రియ నాయక్ ఉన్నారు.