BJP-Janasena | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)/హైదరాబాద్ సిటీబ్యూరో: జనసేనతో బీజేపీ పొత్తు అంశం కాషాయపార్టీలో కలకలం రేపుతున్నది. దీనిని బీజేపీ ఆశావహులతోపాటు శ్రేణులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశం నిరసనలకూ తావిస్తున్నది. ఓట్లు రాని పార్టీతో పొత్తు పెట్టుకొని ఏం సాధిస్తామంటూ గ్రేటర్లోని బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర కార్యాలయానికి నేరుగా వెళ్లి కుండబద్దలు కొట్టినట్టు తమ అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నారు.
జనసేనతో పొత్తు వద్దంటూ శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఈటల, బండి దృష్టికి తీసుకెళ్లారు. ‘మన నిర్ణయమేమీ ఉండదు. అంతా హైకమాండ్ ఆదేశాలతోనే ముందుకెళ్లాల్సి ఉంటుంది. నచ్చినా, నచ్చకున్నా పనిచేయాల్సిందే.’ అంటూ వారు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని నియోజకవర్గ నాయకుడొకరు చెప్పారు. పొత్తులో భాగంగా సీట్లు జనసేనకు కేటాయిస్తే ఆయాచోట్ల బీజేపీ నేతల పరిస్థితి ఏమిటని వారు కమలం పెద్దలను నిగ్గదీస్తున్నారు. ఆ ప్రశ్నకు రాష్ట్ర నాయకత్వం వద్ద సమాధానం లేకపోవడంతో చాలామంది బీజేపీ ఆశావహులు అధికార పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్లోని కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ తదితర నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. వీరి బాటలోనే చాలామంది కాషాయ నాయకులు గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు.
సంక్షేమ, అభివృద్ధి ఎజెండా, మ్యానిఫెస్టోతో దూసుకుపోతున్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు చతికిలపడుతున్నాయి. ఈ దశలో బీజేపీ, జనసేనలు పొత్తు రాజకీయాలకు తెరలేపాయి. అమిత్షా సూచనలతో రెండు పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. ఈ పొత్తు ప్లాన్ కూడా ఆదిలోనే బెడిసికొడుతున్నట్టు రాష్ట్ర పెద్దలకు అవగతమైంది. ఇప్పటికే పొత్తు వద్దంటూ సొంత పార్టీ నేతలు తేల్చిచెప్తున్నారు. ఢిల్లీ పెద్దలు మాత్రం పొత్తు ఉండాల్సిందేనని చెబుతుండటంతో రాష్ట్ర నాయకులు తలలూపుతున్నారు. ఈ దశలో బీజేపీని వీడుతామని బహిరంగంగానే ఆ పార్టీ నేతలు అగ్రనే తలకు తేల్చిచెప్తున్నారు.
తెలంగాణలో కనీసం ఉనికిలో లేని జనసేన పార్టీతో పొత్తు ఎందుకంటూ బీజేపీ ఆశావహులు మండిపడుతున్నారు. ఒకరిద్దరు లీడర్లు కూడా లేని ఆ పార్టీకి పదుల సంఖ్యలో టికెట్లు ఇస్తారన్న ప్రచారంతో బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొంది. జనసేనకు టికెట్లు కేటాయించే అవకాశం ఉన్న నియోజకవర్గాల నుంచి బీజేపీ నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వరుస కడుతున్నారు. తమ సీటు కేటాయించొద్దని ముఖ్య నేతలకు తేల్చి చెప్తున్నారు. ఒకవేళ టికెట్ ఇచ్చినా రాజీనామా తప్పదని హెచ్చరిస్తున్నారు. పవన్కల్యాణ్ వస్తే నలుగురు జనాలు పోగవుతారే తప్ప ఓట్లు పడదని, ఏపీలో ఆ పార్టీ పరిస్థితే ఇందుకు ఉదాహరణ అని చెప్తున్నారు. ఆ పార్టీ నుంచి పవన్కల్యాణ్ తప్ప ఇంకో పేరు ఎవరికైనా తెలుసా? అని వారు ప్రశ్నిస్తున్నారు.