హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాది ముచ్చటగా మూడోసారి రాష్ట్ర ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం వేయడానికి సిద్ధమైంది. ఇంధన వ్యయం సర్దుబాటు (ఎఫ్సీఏ) చార్జీల్లో జరిగిన మార్పుల నేపథ్యంలో చార్జీలు పెంచుకొనేందుకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్ (ఈఆర్సీ) సరఫరా సంస్థలకు అనుమతినిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఒకసారి, జూన్లో ఒకసారి చార్జీలు పెంచేందుకు అనుమతించిన ఈఆర్సీ తాజాగా మరోసారి డిస్కంలకు పచ్చజెండా ఊపింది. దీంతో వచ్చే నెల నుంచి యూనిట్పై అదనంగా 43 పైసలు వసూలు చేస్తామని బెంగళూరు విద్యుత్తు సరఫరా కంపెనీ (బెస్కాం) ప్రకటించింది. బెస్కాం బెంగళూరు అర్బన్, రూరల్ సహా మొత్తం ఎనిమిది జిల్లాల్లో విద్యుత్తును సరఫరా చేస్తున్నది.
యూనిట్పై 24 పైసలు అదనంగా వసూలు చేస్తామని మంగళూరు విద్యుత్తు సరఫరా కంపెనీ (మెస్కాం), 35 పైసలు వసూలు చేస్తామని చాముండేశ్వరి విద్యుత్తు సరఫరా కంపెనీ (సెస్కాం) ప్రకటించాయి. ఇదే రీతిలో హుబ్బళి, గుల్బర్గా ప్రాంతాలకు విద్యుత్తును సరఫరా చేసే కంపెనీలు కూడా చార్జీలను పెంచేందుకు సిద్ధపడుతున్నాయి. కర్ణాటక ఈఆర్సీ గత ఏప్రిల్లో యూనిట్పై 35 పైసలు, జూన్లో 25-30 పైసల వరకు పెంచుకొనేందుకు సరఫరా కంపెనీలకు అనుమతినిచ్చింది. చార్జీల పెంపుపై బెంగళూరుకు చెందిన కామ్రాన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘బెంగళూరులో యూనిట్ ధర 43 పైసలు పెరుగనున్నది. మన బిల్లులు 20శాతం వరకు పెరుగుతాయి. ఈ డబ్బును ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వినియోగించనున్నారు. ఢిల్లీ వాసులు సక్రమంగా పన్ను చెల్లిస్తూ ఉచితంగా విద్యుత్తును పొందుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ట్రాన్స్కో.. వ్యవసాయం, గృహ, పరిశ్రమలు సహా 12 క్యాటగిరీల వినియోగదారులకు విద్యుత్తును సరఫరా చేసేందుకు యూనిట్కు రూ.7.30 ఖర్చు చేస్తున్నది. వసూలు చేస్తున్నది రూ.6 మాత్రమే. యూనిట్పై రూ.1.30 నష్టపోతున్నా నాణ్యమైన విద్యుత్తును అందిస్తుండటం విశేషం.