Rail coach factory | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. విభజన హామీల్లో భాగంగా కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం మొండిచేయి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించేందుకు ముందుకొచ్చినా నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఫలితంగా రాష్ట్ర యువతకు నిరాశే మిగిలింది. నేడు అంతగా ఫలితం దక్కని వ్యాగన్ల వర్క్షాప్ ఏర్పాటుకు సిద్ధమైంది. దీంతో బీజేపీ ప్రభుత్వం చేసిన దగాపై రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు. రాష్ట్ర విభజన హామీ చట్టం ప్రకారం రాష్ట్రంలోని కాజీపేటలో కేంద్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సి ఉన్నది. అందుకోసం 300 ఎకరాలకు పైగా భూమి అవసరం కాగా, 150 ఎకరాల భూమిని రాష్ట్రం రైల్వేశాఖకు ఉచితంగా అప్పగించింది. ఇతర అన్ని సహకారాలను అందించడానికీ సిద్ధమేనని కేంద్రానికి తెలిపింది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో 10 వేల ఉద్యోగావకాశాలు దక్కుతాయని తెలంగాణ యువత ఆశపడింది. కానీ పుండుమీద కారం చల్లినట్టుగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి ప్రకటించి రాష్ట్రంపై వివక్షను ప్రదర్శించారు. దీంతో తెలంగాణ ఉద్యోగాలకు కేంద్రం గండికొట్టినట్టయింది. కేవలం రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే మహారాష్ట్రలోని లాతూరుకు కోచ్ ఫ్యాక్టరీని తరలించడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
కాజీపేటలో వ్యాగన్ వర్క్షాప్తోనే సరి
కాజీపేటలో ప్రతిష్ఠాత్మకమైన రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న హామీని తుంగలో తొక్కిన కేంద్రం వ్యాగన్ వర్క్షాప్ (పీరియాడికల్ ఓవర్ హాలింగ్) ఏర్పాటుకే పరిమితమైంది. అదీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 150 ఎకరాల భూమినే దానికోసం వినియోగించుకుంటున్నది. దీని ఏర్పాటు అంశం రాష్ట్ర విభజన చట్టంలో లేనేలేదు. దీనివల్ల తెలంగాణ నిరుద్యోగ యువతకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. దీని వల్ల కేవలం 1,000 వరకే ఉద్యోగావకాశాలు దక్కే అవకాశం ఉన్నది.
వివిధ రాష్ర్టాల్లోని కోచ్ ఫ్యాక్టరీల్లో ఉద్యోగవకాశాలు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)ని 1955లో ఏర్పాటు చేశారు. మూడేండ్ల క్రితం వరకు ఉన్న లెక్కల ప్రకారం దానిలో 11,300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
లాతూర్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కోచ్ ఫ్యాక్టరీలో దాదాపు ఎనిమిది నుంచి పది వేల వరకు ఉద్యోగాలు కల్పించే అవకాశాలున్నాయి.
1986లో కపుర్తలాలో ఏర్పాటుచేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
2012లో రాయబరేలీలో ఏర్పాటుచేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో దాదాపు 3,000కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి.
చిత్తరంజన్లోని చిత్తరంజన్ లోకో మోటివ్ వర్క్, వారణాసిలోని డీజిల్ లోకో మోటివ్, పాటియాలలోని డీజిల్-లోకో మోటివ్ వర్క్స్, తిరుచురాపల్లిలోని గోల్డెన్ ర్యాక్ రైల్వే వర్క్షాప్, మోదెపురాలోని ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ, బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ వంటి రైల్వే ప్రాజెక్టులలో కూడా వేలాది ఉద్యోగాలు వచ్చాయి.