హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ)/అబిడ్స్: హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు సోమవారం 746 మంది తరలి వెళ్లారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు 373 మంది ఉన్నారు. నాంపల్లి హజ్హౌజ్ నుంచి ప్రత్యేక బస్సుల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి ప్రత్యేక సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ విమానాల్లో యాత్రకు బయలు దేరారు. హజ్ హౌజ్లో హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. సోమవారం తెల్లవారుజామున మొదటి బ్యాచ్లో 373 మంది, సాయంత్రం రెండో బ్యాచ్లో 373 మంది యాత్రికులు శంషాబాద్ నుంచి హజ్యాత్రకు బయలుదేరారు.
వీరికి మహ్మద్ సలీం, భారత హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మహమూద్ అలీ, అబ్దుల్లాకుట్టితో సహా ప్రముఖులు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ప్రఖ్యాత పండితుడు, చాన్స్లర్ జామియా నిజామియా ముఫ్తీ ఖలీల్ అహ్మద్, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఇంతియాజ్, మహ్మద్ ఖమురుద్దీన్, మునవ్హరిబేగం, సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, సయ్యద్ నిజాముద్దీన్, మహమ్మద్ జాఫర్ ఖాన్, హజ్ కమిటీ సభ్యులు అసిమా సుల్తానా, నాదిర్ అలీ రజ్వీ, సయ్యద్ హనీఫ్ అలీ, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యుడు అబ్దుల్ ముఖీత్ చందా తదితరులు పాల్గొన్నారు.