తీరొక్క పూలు ముంగిళ్లు చేరాయి..
ఆడబిడ్డల చేతుల్లో ఒక్కచోట కూరాయి..
గౌరమ్మగా ఇంటింటా కొలువైనాయి..
ఆడపడుచులంతా చేరి కోలాటమాడంగా..
ఊరువాడా కలిసి మురిసి పోవంగా..
ఇంటింటి దైవమై పూజలందుకోవంగా..
నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఎప్పుడెప్పుడా అని ఆడబిడ్డలంతా ఎదురు చూసే బతుకమ్మ పండుగా రానేవచ్చింది. పల్లెపల్లెనా బతుకమ్మ కొలువైంది.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఉత్సవాల్లో.. మహిళలు, యువతులు, బాలికలు ఎంతో ఇష్టంగా జరుపుకొంటారు. అటుకులు, ముద్దపప్పు, నానబియ్యం, అట్లు, అలిగిన, వేపకాయ, వెన్నముద్దలతో కొనసాగి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తొలి రోజు ఉత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఏ పల్లె చూసినా బతుకమ్మ కోలాహలమే నెలకొన్నది. హనుమకొండలోని వేయిస్తంభాల గుడిలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో ఆలయం పూలవనంలా మారింది. వేలాదిగా తరలివచ్చిన మహిళలతో గుడి ప్రాంగణమంతా సందడిగా మారింది. బతుకమ్మ పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేస్తూ మహిళలు మురిసిపోయారు. నిమజ్జనం చేసిన తర్వాత ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. అనంతరం రాధేశ్యాం సాహితీ సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ పాటల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సతీమణి రేవతి పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ముంగిళ్లన్నీ పూల సంద్రాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేడుకలు కనులపండువగా సాగాయి. వేములవాడ ఆలయ పరిసరాల్లో, సిరిసిల్ల మానేరు తీరాన మహిళలు పెద్ద సంఖ్యలో చేరి బతుకమ్మ ఆడారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆడబిడ్డలు సంప్రదాయబద్ధంగా ముస్తాబై తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చారు. ‘చల్లంగా చూడమ్మా.. గౌరమ్మా’ అంటూ మొక్కులు తీర్చుకున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆడబిడ్డలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ ఆడారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో సంబురాలు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.
బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఈ ఏడాది రూ. 10 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ నిమజ్జన ఘాట్ల వద్ద ప్రమాదాలు జరుగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. రవీంద్రభారతిలో తొమ్మిది రోజులపాటు నిర్వహించే సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, అధికార భాషా సంఘం, తెలంగాణ సాంస్కృతిక సారథి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ, తెలంగాణ జాగృతి తదితర సంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజ్భవన్లో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.