రాజన్న సిరిసిల్ల : ఉయ్యాలే ఆ చిన్నారి పాలిట ఉరితాడైంది. పాప సరదాగా ఆడుకుంటుందని తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాల వారి కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. ఊయ్యాలే ఆ చిన్నారి పాలిట మృత్యు పాశమై ఊపిరి తీసింది. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దిలీప్ దంపతులకు ఏడాది వయసు గల పాప ఉంది. పాప ఇంట్లో ఆడుకుంటుందని తల్లిదండ్రులు ఉయ్యాల కట్టారు. అదికాస్తా పాప మెడకు బిగియడంతో ఊపిరాడక మరణించింది.
పక్క గదిలో ఉన్న కుటుంబ సభ్యులు గుర్తించే సరికే అప్పటికే నష్టం జరిగిపోయింది. చిన్నారిని వైద్యం కోసం హాస్పిటల్కు తీసుకెళ్లగా.. పాప మరణించిందని వైద్యులు ధృవీకరించారు. అప్పటి వరకు సరదాగా ఆడుకుంటున్న పాప అంతలోనే మృత్యు ఒడిలోకి చేరడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.