మలక్పేట, మార్చి 20: ఫైనాన్సర్లు ఆటోను లాక్కెళ్లటంతో ఉపాధిని కోల్పోయి, కుటుంబ పోషణ భారమై, ఆర్థిక ఇబ్బందులతో సతమతమై సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్ రాత్లావత్ రమేశ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మృతుడి భార్య ప్రియ, బస్తీవాసులు డిమాండ్చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన తమ కుటుంబం రోడ్డున పడిందని, తల్లిదండ్రులు ఇద్దరు మరణించటంతో అనాథలైన ఇద్దరు ఆడ పిల్లలను పోషించటం తనకు భారంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్నారులు ఎల్కేజీ, నర్సరీ చదువుతున్నారని, ఏడు నెలల క్రితం వచ్చిన తాను బయటి ప్రపంచం ఎరుగనని, ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఎలా పోషించేదని కన్నీటి పర్యంతమయ్యారు. అత్యంత దీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రమేశ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బస్తీనాయకుడు నేనావత్ అనిల్ విజ్ఞప్తి చేశారు. ఇద్దరు చిన్నారుల చదువులకు, వారి భవిష్యత్తుకు అండగా నిలిచేలా ఆర్థికంగా సాయంచేసి ఆదుకోవాలని కోరారు.