వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 3: అనస్థీషియా పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసు విషయంలో నిందితుడిగా అభియోగం మోపబడిన పీజీ సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ సస్పెన్షన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ తరగతులకు హాజరు కావడానికి అనుమతించినట్లు కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
2023 ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ తను మృతిచెందిన ఘటనలో కేఎంసీలో ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్దాస్ అధ్యక్షతన 2023 మార్చి 1న సుమారు మూడు గంటల పాటు13మందితో జరిగిన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో నిందితుడిపై చర్యలకు తీర్మానిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)లకు నివేదిక అందజేసి, సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇటీవల పోలీసులు నిందితుడిపై కోర్టులో చార్జ్షీట్ సమర్పించిన సమయంలో తనను విచారించకుండానే యాంటీ ర్యాగింగ్ కమిటీ సంవత్సరకాలం పాటు సస్పెండ్ చేయడం సరైనది కాదని నిందితుడి తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేయడంతో కోర్టు కమిటీ తీర్మానాన్ని తప్పుబట్టింది. నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి వివరణను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరైందికాదని, విచారణ తిరిగి నిర్వహించాలని కేఎంసీ వైద్యాధికారులతో పాటు యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల ప్రకారం పీజీ సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ సస్పెన్షన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ, తరగతులకు హాజరు కావడానికి అవకాశాన్ని కల్పించింది. వారం రోజుల అనంతరం తిరిగి యాంటీ ర్యాగింగ్ కమిటీ పునఃవిచారణ జరిపి తీర్మాణాన్ని కోర్టుకు సమర్పిస్తామని కేఎంసీ ప్రిన్సిపల్ తెలిపారు.