హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్)పై డబుల్ ఆర్ (రేవంత్రెడ్డి, రఘునందన్రావు) దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కేపీ వివేకానంద మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్, రఘునందన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ట్రిపుల్ ఆర్ టెండర్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, అవినీతి, పక్షపాతానికి ఎక్కడా తావులేదని స్పష్టంచేశారు. గురువారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సుధీర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డికి అభివృద్ధి రుచించదని, ఔటర్రింగ్రోడ్డు లీజుపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఐఆర్బీ సంస్థకు లీజు దక్కిందని స్పష్టంచేశారు. టెండర్లలో పాల్గొన్న వాటిలో నాలుగు కంపెనీలను షార్ట్ లిస్ట్ చేస్తే అందులో ఐఆర్బీ సంస్థ అత్యధికంగా రూ.7,272 కోట్లను కోట్ చేసిందని, దీంతోపాటు ప్రీ బిడ్డింగ్ టెండర్ల ద్వారా రూ.15.80 కోట్లు వచ్చాయని వివరించారు. ఈ మొత్తం ప్రక్రియలో రూ.7,380 కోట్లు ప్రభుత్వానికి డిపాజిట్ అయిందని తెలిపారు.
ప్రభుత్వానికి డిపాజిట్ అయిన మొత్తం వల్ల 30 ఏండ్లలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఐటీఆర్ సంస్థ నిబంధనల ప్రకారమే ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తుందని, ఇందులో 10% డబ్బు ముందు చెల్లించాలని రేవంత్ అనడం శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే ఏ మంచిపనినైనా పనిగట్టుకొని బురద జల్లడం రేవంత్కు అలవాటైపోయిందని విమర్శించారు. కర్ణాటక ప్రజలు ఛీ కొట్టినా బీజేపీకి బుద్ధిరాలేదని ఎద్దేవా చేశారు. ఔటర్ రింగ్రోడ్పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు చెప్పారు. సీబీఐ, ఈడీ, ఐటీ ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని మోదీ తన త్రివిధ దళాలుగా మార్చుకున్నారని, అందులో భాగంగానే రఘునందన్రావు ట్రిపుల్ ఆర్పై ఫిర్యాదు చేశారని దుయ్యబట్టారు. 40% కమీషన్ అంటూ కర్ణాటకలో బీజేపీని ఓడించిన కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై 30% కమీషన్ అని ఆరోపణలు చేస్తే ప్రజలెవరూ విశ్వసించరని చెప్పారు. ఇక్కడున్నది సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
రాష్ట్ర గవర్నర్ ఆ స్థానానికి ఉన్న గౌరవాన్ని తగ్గించేలా, రాజకీయ నేత మాదిరిగా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని సుధీర్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్కు మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
మంత్రి కేటీఆర్ తన శక్తియుక్తులతో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్కు రప్పిస్తుంటే రేవంత్రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. కేటీఆర్ విదేశీ పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు తమ కార్యక్షేత్రంగా హైదరాబాద్ను ఎంచుకోవడంలో కేటీఆర్ కృషిని ఎవరూ కాదనలేరని చెప్పారు. రేవంత్ వైఖరి మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని వివేకానంద హెచ్చరించారు. కేటీఆర్ తన మేధాశక్తితో సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో ఇప్పటికే 22,100 కంపెనీలను రాష్ర్టానికి తెచ్చారని వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగిందని, ఐటీ ఎగుమతులు రికార్డు స్థాయిలో ఉన్నాయని వివరించారు. 111 జీవోపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో 111 జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మరచిపోయిందా? అని వివేకానంద ప్రశ్నించారు.