హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం రాత్రి ఆమె అరెస్ట్ వార్త తెలియగానే పార్టీ శ్రేణులతోపాటు మహిళలు, మహిళా సంఘాల ప్రతినిధులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేసి, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. భువనగిరి పట్టణంలో ప్రిన్స్ కార్నర్ వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేశారు. కవిత అక్రమ అరెస్ట్ను ఖండించారు.
విచారణ జరుగుతున్న సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారంటూ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగామ క్రాస్రోడ్లో రాస్తారోకో చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవరకొండలో రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాలలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టగా, మెట్పల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా, నిరసనలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ చౌరస్తా, జనగామ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు.