యాదగిరిగుట్ట, డిసెంబర్ 18: ముక్కోటి(వైకుంఠ) ఏకాదశిని పురస్కరించుకుని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దివ్య క్షేత్రంలో ఏర్పాట్లపై ఆలయ అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 23న స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్న నేపథ్యంలో ఉత్తర రాజగోపురం ముందు గల మాఢ వీధుల్లో చుట్టూ తాత్కాలిక గ్రిల్స్ బిగించనున్నారు.
ఈ మేరకు సోమవారం ఆలయ డీఈవో దోర్బల భాస్కర్శర్మ, ఆలయ ఈఈ దయాకర్రెడ్డి, ఏఈవో గట్టు శ్రవణ్కుమార్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్వామి ఉత్తర ద్వార దర్శనానికి వీవీఐపీ, వీఐపీతోపాటు సాధారణ భక్తుల తాకిడి పెరుగనున్న నేపథ్యంలో ప్రత్యేక లైన్లు ఏర్పాట్లు చేస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి పూర్తైన అనంతరం గ్రిల్స్ను తొలగించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.