Gurukula PGT | గురుకులాల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల దరఖాస్తు గడువు ఈ నెల 24న ముగియనున్నది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషం దాకా వేచిచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) అధికారులు కోరారు. ఇప్పటికే పీజీటీ పోస్టులకు 50వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 1,276 పీజీటీ, స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టుల భర్తీకి గత ఏప్రిల్ 24న నోటిఫికేషన్ను ట్రిబ్ జారీ చేసిన విషయం తెలిసిందే.
గురుకులాల్లోని 9,231 పోస్టులకు ఇప్పటివరకు మొత్తం 2 లక్షలకుపైగా దరఖాస్తులొచ్చినట్టు ట్రిబ్ అధికారులు వెల్లడించారు. జూనియర్ లెక్చరర్ పోస్టులకు 48,893, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు 7,984 దరఖాస్తులు రాగా, మొత్తం 56,877 దరఖాస్తులు నమోదైనట్టు వెల్లడించారు. ఇక పీడీ, లైబ్రేరియన్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు లక్ష దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు.