హైదరాబాద్, ఏప్రిల్3 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ చేపట్టనున్న విచారణపై స్టే విధించాలని ఏపీ సర్కారు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు దాఖలైన రిట్ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 89 మార్గదర్శకాల మేరకు కాకుండా అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ మధ్య పంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరడం, ఈ నేపథ్యంలో కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ)కు కేంద్రం నూతన మార్గదర్శకాలను జారీ చేయడం తెలిసిందే. అయితే కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.