ఏటూరునాగారం, జనవరి 7: ములుగు జిల్లా ఏటూరునాగారం విద్యార్థి రూ.33 లక్షల వార్షిక ప్యాకేజీతో ఐటీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. నూతి రమేశ్, శోభ కుమారుడు మణికంఠ సాయికి అమెరికాలోని కాలిఫోర్నియా శాన్డి గోలోని ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్న క్వాల్కమ్ కంపెనీ ఈ ఆఫర్ ఇచ్చింది. ఏటూరునాగారంలో పదోతరగతి వరకు చదివిన మణికంఠ మండల టాపర్గా నిలిచారు. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు రాగా అక్కడే బీటెక్ పూర్తిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఐఐటీలో ఎంఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా క్వాల్కమ్ కంపెనీ రూ.33 లక్షల వార్షిక ప్యాకేజీతో బెంగళూరు కేంద్రంలో ఐటీ ఉద్యోగానికి మణికంఠను ఎంపికచేసుకొన్నది. ఈ కంపెనీ సెమీ కండక్టర్స్, సాఫ్ట్వేర్ వైర్లెస్ టెక్నాలజీ సేవలను అందిస్తున్నది. బహుళ జాతి సంస్థలో తమ కుమారుడు ఉద్యోగానికి ఎంపిక కావడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు.