Congress | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నవారికి కాకుండా పారాచ్యూట్ నేతలకే టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ప్రకటించిన కాంగ్రెస్ తొలి జాబితాలో కొత్తగా పార్టీలో చేరిన 11 మందికి టికెట్ల కేటాయించారు. ఇందులో వారం, పది రోజులు, నెల క్రితం పార్టీలో చేరినవారికి కూడా టికెట్లు కేటాయించడంతో ఆయా టికెట్లపై ఆశలు పెట్టుకున్నవారు రగిలిపోతున్నారు. పలువురు నేతలు పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కొత్తగా పార్టీలో చేరి టికెట్లు పొందినవారిలో కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి), మైనంపల్లి రోహిత్ (మెదక్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), వేముల వీరేశం (నకిరేకల్), ఏ చంద్రశేఖర్ (జహీరాబాద్), సునీల్రెడ్డి (బాల్కొండ), వినయ్కుమార్రెడ్డి (ఆర్మూర్), శ్రీహరిరావు (నిర్మల్), కూచుకుళ్ల రాజేశ్రెడ్డి (నాగర్కర్నూల్), సరితా తిరుపతయ్య (గద్వాల) ఉన్నారు. ఈ పరిణామాన్ని పాత నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నేండ్లుగా పార్టీ కోసం పనిచేస్తే తమకు దక్కిన గౌరవం ఇదేనా? అని మండిపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పారాచ్యూట్ నేతలతో కొట్లాడిన తాము ఇప్పుడు వారి కింద ఎలా పనిచేస్తామని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో చేరినవారికి సహకరించేది లేదని తెగేసి చెప్తున్నారు.