హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి విద్యుత్తు బకాయిలపై చేసిన ఆరోపణలు అవాస్తమని తేలింది. ఆ రోజు సీఎం మాట్లాడుతూ.. ‘విద్యుత్తు సరఫరాలో, బిల్లుల వసూలులో ఎమ్మెల్యే హరీశ్రావు బాధ్యత వహిస్తున్న సిద్దిపేటలో 61.37 శాతం, మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో 50.29 శాతం, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చెప్తున్న.. హైదరాబాద్ సౌత్ నుంచి 43 శాతం ట్రాన్స్మిషన్ నష్టాలున్నాయి.
ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్తు వినియోగించటంలో, బిల్లులు ఎగవేయటంలో మొదటి స్థానంలో సిద్దిపేట ఉన్నది. రెండో స్థానంలో గజ్వేల్, మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉన్నది. ఈరోజు మొత్తం విద్యుత్తు రంగమే దివాలా తీయడానికి, అప్పుల పాలు కావడానికి ఈ మూడు ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవడమే కారణం. బకాయి బిల్లులు చెల్లిస్తామని ఈ ముగ్గురు నేతలు ఎందుకు ముందుకు రాలేదు?’.. డిసెంబర్ 21 నాడు అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలివి.
ఈ విమర్శలపై ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. సిద్దిపేట సర్కిల్ (జిల్లా) మొత్తంపై ఉన్న విద్యుత్తు బకాయిల్లో సుమారు 97.8 శాతం నీటిపారుదల, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినవే ఉన్నట్టు తేలింది. గృహ వినియోగదారులల బకాయిలు రూ.7.03 కోట్లే. అంటే మొత్తం బకాయిల్లో కేవలం 0.35 శాతమన్నమాట.
సిద్దిపేట సర్కిల్ (జిల్లా) పరిధిలో విద్యుత్తు బకాయిల మొత్తం రూ.1,984.31 కోట్లు ఉన్నాయి. ఇందులో హెచ్టీ ఇరిగేషన్ (నీటిపారుదల), హెచ్టీ గవర్నమెంట్ సర్వీసెస్ (ప్రభుత్వ కార్యాలయాలు)లకు సంబంధించిన బకాయిలే రూ.1,938 కోట్ల వరకు ఉండటం గమనార్హం. అంటే మొత్తం బకాయిల్లో ఈ రెండు క్యాటగిరీల బకాయిలు కలిపి 97.7 శాతం ఉన్నాయి. పాఠశాలలు, దేవాలయాలకు సంబంధించిన బకాయిలు రూ.1.30 కోట్లు, వీధి దీపాలు, పీడబ్ల్యూఎస్ లాంటివాటి బకాయిలు రూ.15.28 కోట్లు ఉండగా, వ్యవసాయానికి సంబంధించిన బకాయిలు రూ.15.87 కోట్లు ఉన్నాయి. గృహ వినియోగదారుల నుంచి రావాల్సింది రూ.7.03 కోట్లు మాత్రమే. మొత్తం బకాయిల్లో ఇవి 0.35 శాతం. రూ.13.83 కోట్లు మాత్రమే వ్యక్తిగత వినియోగదారులకు సంబంధించినవి. మిగతా మొత్తం ప్రభుత్వమే చెల్లించాల్సి ఉన్నది.
నిజానికి సిద్దిపేట జిల్లాలో నీటిపారుదలకు సంబంధించిన రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా లిఫ్ట్లు భారీగా ఉన్నాయి. అందుకే నీటిపారుదల శాఖ బకాయిలు రూ.1,019 కోట్లు ఉన్నాయి. ఇక ప్రభుత్వ సర్వీసుల్లో కలెక్టరేట్, సీపీ కార్యాలయం.. ఇలా మొత్తం ప్రభుత్వ కార్యాలయాల మొత్తం బకాయిలు రూ.919 కోట్లు ఉన్నాయి. ఇలా 97.7 శాతం ప్రభుత్వ బకాయిలే ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను బాధ్యులను చేసి బకాయిలు చెల్లించేలా చూడాలని సీఎం అంటున్నారు. అంటే ఆయా ఎమ్మెల్యేలు బకాయిల కోసం సీఎంను నిలదీయాలా? ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై బురదజల్లేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నదని, సీఎం చెప్పినదాంటో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం లేదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పైగా బిల్లులు కట్టడంలేదని సిద్దిపేట, గజ్వేల్ ప్రజలను సీఎం అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.