హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): చేనేతపై జీఎస్టీని రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగబోదని అఖిల భారత పద్మశాలి సంఘం పునరుద్ఘాటించింది. త్వరలోనే లక్ష మందితో ఢిల్లీలో మహార్యాలీ నిర్వహిస్తామని ప్రకటించింది. బెంగళూరు లెజిస్లేటివ్ హౌస్లో గురువారం నిర్వహించిన జీరో జీఎస్టీ ఉద్యమ వార్షికోత్సవ సభలో ఈ మేరకు తీర్మానించారు. కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ కేసీ కొండయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ రాష్ర్టాల నుంచి చేనేత సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. జీఎస్టీ తొలగింపు కోసం చేపట్టాల్సిన భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. పలు తీర్మానాలు చేశారు.
త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్ను, గ్రూప్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్స్ చైర్మన్ను కలిసి వినతిపత్రాలను అందజేయాలని, కర్ణాటక ఎన్నికల్లో చేనేతపై జీరో జీఎస్టీ అంశాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టాలని తీర్మానించారు. అన్ని కుల సంఘాలను కలుపుకొని ఢిల్లీలో లక్ష మందితో రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత అన్ని రాష్ర్టాల్లోనూ సమావేశాలు పెట్టాలని తీర్మానించారు. సభానంతరం బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.
సమావేశంలో కర్ణాటక స్టేట్ వీవర్స్ ఫెడరేషన్ నేత బీఎస్ సోమశేఖరా, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న, జగన్నాథం, మహిళా అధ్యక్షురాలు వనం దుశ్యంతల, కోస్తాంధ్ర నేతలు జీ నాగేశ్వర్రావు, తమిళనాడు నుంచి వెంకటాచలపతి, రాయలసీమ నుంచి కొంకటి లక్ష్మీనారాయణ, కాలప్ప, షీలా చినబ్రహ్మయ్య, అవ్వారి మంజునాథ్, తిరువీధుల వెంకటేశ్, నరేంద్ర కుమార్తోపాటు కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తదితర రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం పిలుపు మేరకు తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జలదృశ్యం ప్రాంతంలో చేనేత కార్మికులు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం దగ్గర నిర్వహించిన సమావేశంలో పవర్ లూమ్స్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ మాట్లాడుతూ.. చేనేతపై కేంద్రం విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాసర్ మాట్లాడుతూ.. చేనేతపై పన్ను ఎత్తివేయాలని 82 మంది ఎంపీలు, అనేక పార్టీలు మద్దతు తెలిపాయని, అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ర్యాలీలో అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకూరి సునీత, మహిళా విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు శారద, నాయకులు కొకుల దేవేందర్, అంబటి శ్రీనివాస్, తెలంగాణ సాయి, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు స్వామి తదితరులు పాల్గొన్నారు.