ఉస్మానియా యూనివర్సిటీ : సమానత్వ సాధనే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ లక్ష్యమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్ర చాలా విలువైందని కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ గవాయ్ ‘కానిస్ట్యూషన్ ఆఫ్ ఇండియా : ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల కోసం ఆయన ఎంతో తాపత్రయపడ్డారని చెప్పారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేరుగా భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్ పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇది రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అభిప్రాయపడ్డారు.
ఒకే దేశం – ఒకే రాజ్యాంగం ఉండాలని ఆయన గట్టిగా నమ్మారని చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఇన్ని ఏళ్ల కాలంలో అంతర్గతంగా.. బహిర్గతంగా ఎన్నో సమస్యలు వచ్చినా ఒకే రాజ్యాంగం కారణంగానే వాటన్నింటినీ తట్టుకొని శక్తివంతంగా నిలబడిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రెండు ఎంతో ప్రధానమైనవి అని చెప్పారు. మరోవైపు భవిష్యత్తు తరాలకు అనుగుణంగా రాజ్యాంగంలో సవరణలు చేసుకునే అవకాశం కల్పించడం గొప్ప విషయం అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం సాధించినప్పుడే సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ మాట్లాడుతూ ఓయూకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
నిజాం కాలంలో అంబేద్కదర్ను హైదరాబాద్ దేశ ప్రధాన న్యాయమూర్తి పదవి ఇస్తామని ఆహ్వానించిన ఆయన తిరస్కరించారని గుర్తు చేశారు. సమానత్వం కోసం పనిచేయడానికి నిర్ణయించుకొని అంబేద్కర్ ముందుకు సాగారని కీర్తించారు. కార్యక్రమంలో పోస్టల్ విభాగం ఆధ్వర్యంలో ‘బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ – కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ – కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ పై ముద్రించిన ప్రత్యేక కవర్, ‘ఆర్ట్ అండ్ కాలిగ్రఫీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’పై రూపొందించిన పోస్ట్ కార్డ్ చిత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఓయూ అధికారులు పాల్గొన్నారు.