నారాయణపేట : ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తికి సమానంగా న్యాయం,స్వేచ్ఛా, సమానత్వం అందించడమే న్యాయ సేవా సదనం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ పి. నవీన్ రావు అన్నారు.
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ భవనంలో.. అసంఘటిత కార్మికులకు వారి హక్కులు, చట్టాల పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మెగా లీగల్ అవేర్ నెస్ క్యాంపునకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ పి. నవీన్ రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. మనకు దక్కాల్సిన హక్కులను న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ న్యాయ పోరాటంలో గెలవడానికి అందరికి మంచి వకీలును పెట్టుకొని విజయం సాధించలేరన్నారు.
అలాంటి పేదవారికి న్యాయం అందించడానికి లీగల్ సర్వీసెస్ అథారిటీని రూపొందించారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో 14 వందల లీగల్ అవేర్ నెస్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు సైతం చట్టాలు, వారి హక్కుల పై అవగాహన కల్పించేందుకు పాఠశాల స్థాయిలో, జైల్లో కూడా లీగల్ అవేర్ నెస్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.
కార్యక్రమంలో మహబూబ్ నగర్ సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ ప్రేమావతి, స్టేట్ లీగల్ సర్వీసెస్ మెంబర్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి, ఆంజనేయులు, అసనవు కలెక్టర్ పద్మజా రాణి, ఏ.జి.పి సతీష్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, సలీం తదితరులు పాల్గొన్నారు.