హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు అని, పార్టీలు.. నాయకులు కాదు అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఎన్నికల్లో ఎవరు గెలవాలె? ఎన్నికలు జరిగినప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యం అయితే.. ఆ స్ఫూర్తి నిజంగా ఉంటే.. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు. కానీ పార్టీలు గెలుస్తున్నాయి, నాయకులు గెలుస్తున్నారు. ప్రజలు ఓడిపోతున్నారు. ఏ ఆశతో అయితే ప్రజలు గెలిపిస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరడంలేదు. మన దేశంలో నిరంతరం ఇదే జరుగుతున్నది. ఇది పోవాలె. ఇదే బీఆర్ఎస్ లక్ష్యం.
ఇండియా రియాక్ట్స్
భారతదేశం బుద్ధిమంతుల దేశం. బుద్దూగాళ్ల దేశం కాదు. ఇండియా రియాక్ట్స్.. మన ప్రయత్నం ప్రబలంగా ఉంటే, మనం సందేశం చెప్పితే, దాన్ని ప్రతి మనిషికి, ప్రతి గుండెకు చెప్పగలిగితే ఇండియా రియాక్ట్స్. ఈ విషయాన్ని నా కళ్లతో నేను చూసిన. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్పై యుద్ధంలో గెలిచి వచ్చాక, సమీప భవిష్యత్తులో ఆమెను ఓడించేవాళ్లు దేశంలో లేరని, పేపర్లలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వచ్చినయి. రాజకీయ చర్చలు కూడా అదే విధంగా జరిగేవి. కానీ ఒక్క స్పార్క్.. ఒక్క వెలుగు రవ్వ.. ఒక్క అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. ఆ తరువాత వచ్చిన ఎమర్జెన్సీ.. ఆ తరువాత లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తెచ్చిన ఉద్యమం.. దాని పర్యవసానం మనకు తెలుసు.
పవర్ఫుల్ అనుకున్న ఇందిరాగాంధీని దేశం గిల్లి పడేసింది. గెలిచిన వాళ్లు పిచ్చి పనులు చేస్తే రెండు సంవత్సరాల్లోనే మళ్లీ ఆమెనే గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టారు. దీనిని బట్టి ఏం అర్థం అవుతుంది? ప్రజలకు అర్థమైతే, విషయాన్ని ఆ విధంగా చెబితే, చెప్పగలిగితే, ఇండియా రియాక్ట్స్. ఆ నమ్మకంతోనే ప్రారంభించింది బీఆర్ఎస్. ఎల్లుండి పొద్దుగూకేకల్లా ఈడ అధికారంలోకి రావాలె, మాయా మశ్చీంద్ర చేయాలి. పనికి మాలిన అబద్ధాలు అన్ని చెప్పాలె.. ఇది కాదు బీఆర్ఎస్ లక్ష్యం.
ఢిల్లీలో తాగేనీరు ఉండదా?
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశ రాజధాని ఢిల్లీలో తాగేనీరు కూడా దొరకదా? ఢిల్లీలో సరిపోయేంతగా మంచినీరు సరఫరా కావడం లేదు. ఢిల్లీకి విమానంలో పోతే దాదాపుగా 30-40నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టాలె. విమానం దిగడానికి లైన్ దొరకదు. ఢిల్లీ సిటీలో కొన్ని ప్రాంతాల్లో కరెంటు కోతలు ఉంటయట. వాళ్ల ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతయి, చెవులు తూట్లు పడతయి. మహామహా నాయకులు, మహా పండితులు, మేధావులు, మొత్తం మేమే చేశామని చెప్పేవాళ్లు ఉన్నరు. ఇవన్ని దేని ఫలితం?
దళిత బిడ్డలు అట్లనే ఉండాల్నా?
తరతరాలు వివక్షకు గురై, అనేక బాధల్లో ఉన్న దళిత బిడ్డలు అట్లనే ఉండాల్నా. ఇంకెంత కాలం ఉండాలె? దేశానికి ఏం ఖర్మ ఇది? ఇట్లాంటి విషయాల పరిష్కారం కోసమే బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఒక వర్గం కోసమో, ఒక కులం కోసమో, ఒక మతం కోసమో కాదు.
మనం మౌన ప్రేక్షకుల్లాగా ఉండాల్నా?
తాత్కాలిక, రాజకీయ ప్రయోజనాల కోసం మత పిచ్చి పెట్టడం, సమాజాన్ని విభజించడం, ఆ పర్యవసానం ఎక్కడికి పోతది. మన స్వల్పకాలిక ప్రయోజనం కోసం, మన స్వార్థం కోసం, మనం నాటే విష బీజం.. అదో వృక్షమై సమాజాన్ని విడదిస్తే , ఆ ద్వేషం అట్లనే ఉంటే, భారత సమాజం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలె? ఎంత హత్యకాండను చూడాలె? ఆ ద్వేషంలో నుంచి వచ్చే మంటల్లో ఎవరు ఆహుతి కావాలె? జాతి, జీవనాడి దహించుకొని పోవాల్నా? ఇదంతా చూస్తూ మనం మౌన ప్రేక్షకుల్లాగా ఉండాల్నా? గోల్మాల్ గోవిందం గాళ్లను ఇట్లనే భరించాల్నా? ఎందుకు భరించాలె?
బాగా కష్ట పడాల్సి ఉంటది
నా ప్రార్థన ఒక్కటే, మీలో ఒక బిడ్డగా, సాటి వ్యక్తిగా, ఒక భారతీయుడిగా ఈ మహాయజ్జంలో చంద్రశేఖర్, కిషోర్బాబు, పార్థసారథి వచ్చారు. గంటల పాటు అభిప్రాయాలను పంచుకున్నం. నా ఆలోచన, నా ఉద్దేశం వారికి చెప్పిన. కష్టం బాగా చేయాల్సి ఉంటది, బాగా కష్టపడాల్సి ఉంటదని చెప్పిన. ఫలితాలు వస్తుంటయి. ఎగుడు దిగుడులు ఉంటాయి. జయాలు అపజయాలు, అవమానాలు, అవహేళనలు, ఇవన్నీ కామన్గా ఉంటయి. ఈ రంగమే అట్లాంటిది. మనం పురోగమిస్తూ పోతే, ముందుకు వెళ్లిపోతుంటాం.. శక్తి వస్తది. మేము కూడా మీతో జతకడుతాం.
ఆంధ్రప్రదేశ్ భాగస్వామి కావాలి
భారతదేశాన్ని ఉజ్వలంగా తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి కావాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా కొందరు మేమే కర్తలం అనేది పోవాలె. అచ్చమైన అసలు సిసలు ప్రజా రాజకీయాలు ప్రారంభం కావాలె. భారతదేశంలో ప్రబలంగా మార్పు వచ్చి తీరాలి. దేర్ ఇజ్ నీడ్.. డైర్ నీడ్. ఇట్స్ హైటైం నౌ.
బీఆర్ఎస్ ఒక యజ్ఞం
భారతదేశ ఆలోచనా సరళిని, భారతదేశ పురోగమనాన్ని, భారతదేశం కోసం, ఒక ఉజ్వల భారత నిర్మాణ కోసం ఉపయోగించే నైపుణ్యాన్ని ఈ సమాజానికి, యువతకు చెప్పి, తయారు చేయడమే బీఆర్ఎస్ యజ్ఞం. ఎలక్షన్ ఇజ్ ఏ ప్రాసెస్.. కమ్స్ అండ్ గోస్. ఆలోచన స్థిరంగా ఉంటది. లక్ష్యం స్థిరంగా ఉంటది. మనకు చిత్తశుద్ధి, లక్ష్య శుద్ధి, వాక్ శుద్ధి ఉంటే ఖచ్చితంగా మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. నాకు ఆ నమ్మకం సంపూర్ణంగా ఉంన్నది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.