నిర్మల్ : కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని రాష్ట్ర విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. బుధవారం భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించామని, ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
అందులో భాగంగానే ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,300 కోట్లతో అన్ని పాఠశాలల్లో భవనాలు, మరుగుదొడ్లు, నీటి వసతి, బోధన, క్రీడా సామగ్రి, సాంకేతిక విద్య వంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలో 260 పాఠశాలలకు రూ. 80.86 కోట్లు కేటాయించామన్నారు.
అందులో ముథోల్ నియోజకవర్గంలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా 112 పాఠశాలలకు రూ.39.54 కోట్లు ఆధునీకరిస్తున్నామన్నారు. అనంతరం శ్రీధర్రెడ్డిని ఎమ్మెల్యే విఠల్రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు.