హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యువతలో సమస్యా పరిష్కార నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ థింకింగ్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు, ఆవిష్కరణలు, వ్యవస్థాపనను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఐటీశాఖ కీలక ముందడుగు వేసింది. టీ-హబ్ తరహాలో యువ ఆవిష్కర్తల కోసం రాష్ట్రంలో వై-హబ్ (యూత్ హబ్)ను ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం, యునిసెఫ్ ఇండియా మధ్య అవగాహన (స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్) కుదిరింది. బయో ఏషియా సదస్సులో భాగంగా శుక్రవారం నోవాటెల్ హోటల్లో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ఒప్పందం కుదరగా, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్కాఫ్రీ సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. యునిసెఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోవడం చరిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. ఈ ప్రయత్నం తెలంగాణ యువత ఆవిష్కరణల ఏకోసిస్టంను మరింత ప్రోత్సహిస్తుందని తెలిపారు. పాఠశాల, కళాశాల దశలోనే ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకు యునిసెఫ్ ఇండియాతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. వై-హబ్ ద్వారా యువత నిరంతరం ఇన్నోవేషన్స్పై దృష్టిసారిస్తుందని తెలిపారు. అలాగే, వై-హబ్ యువ ఆవిష్కర్తలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ల మధ్య వారధిగా సేవలు అందిస్తుందని వెల్లడించారు. యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్కాఫ్రీ మాట్లాడుతూ, తెలంగాణ యువ ఆవిష్కర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ హబ్గా వై-హబ్ నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఎడ్యుకేషన్ లీడ్ అపూర్వభాస్కర్ దాస్యం, తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటం తదితరులు పాల్గొన్నారు.