ములుగు, ఆగస్టు07 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మల్లారెడ్డి హత్య కేసును ములుగు పోలీసులు చేదించి 10మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జి.పాటిల్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఈ నెల 1వ తేదీన మల్లారెడ్డి హత్య జరగగా.. హత్య వెనుక ప్రధాన కుట్ర దారులను గుర్తించి పట్టుకున్నారు. హత్యకు సూత్రదారులైన గోనెల రవీందర్, పిండి రవియాదవ్, వంచ రామ్మోహన్రెడ్డి, తడుక రమేష్లను పోలీసులు శనివారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు.
మృతుడు మల్లారెడ్డితో కొన్నేండ్లుగా మల్లంపల్లిలోని మైనింగ్ భూములకు సంబంధించిన పలు వివాదాల్లో నర్సంపేటకు చెందిన గోనెల రవీందర్, మల్లంపల్లికి చెందిన పిండి రవియాదవ్, కొడిశలకుంటకు చెందిన వంచ రాంమ్మోహన్రెడ్డిలకు తగాదాలు జరిగాయన్నారు.
మల్లారెడ్డిని హత్య చేసేందుకు పథకం వేసి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన ఆర్ఎంపీ, తడుక రమేష్కు 2020లో రూ.18లక్షల సుపారి ముట్టజెప్పి హత్యకు ఒప్పందం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు.
దీంతో తడుక రమేష్ తన గ్రామానికి చెందిన నైనాల శివతో పాటు హన్మకొండ జిల్లా గంగిరేనిగూడెం గ్రామానికి చెందిన పెరుమాండ్ల రాజు, పెరుమాండ్ల రాకేష్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా కొంక్కెరంచ గ్రామానికి చెందిన ఈడిగ జయరాం, ఈడిగ వేణులతో పాటు నంద్యాల జిల్లా పాములపాడు గ్రామానికి చెందిన బుక్క వెంకటనారాయణలు హత్య పథకాన్ని అమలు చేశారని వివరించారు.
ఈ నెల 1వ తేదీన పందికుంట వద్ద దారి కాచి మల్లారెడ్డిని కత్తులతో పొడిచి చంపారని పేర్కొన్నారు. మల్లారెడ్డి హత్యలో మరికొంత మంది ప్రమేయం ఉందని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారన్నారు.
వారితో పాటు హత్యకు సహకరించిన వారిని పట్టుకునేందుకు ములుగు ఏఎస్పీ ఆధ్వర్యంలో బృందాలను నియమించినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఓఎస్డీ గౌస్ ఆలం, ఏఎస్పీ ఎస్.ఆర్.కేకన్, పోలీస్ అధికారులు ఉన్నారు.