Gajwel | ఏ పార్టీ గెలిస్తే రాష్ర్టానికి, జనానికి మంచిదో గుర్తించడంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు. అందుకే, ఇక్కడి ప్రజలు ఏ పార్టీనైతే నియోజకవర్గంలో గెలిపిస్తారో అదే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది. 1967 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. 1967, 1972, 1978 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కాంగ్రెస్ తరఫున జీ సైదయ్య విజయం సాధించారు.
ఈ మూడు ఎన్నికల్లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1983లో టీడీపీ తరఫున ఏ సాయిలు, 1985లో బీ సంజీవరావు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ రెండు ఎన్నికల్లోనూ టీడీపీ అధికారం చేపట్టింది. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి గీతారెడ్డి ఎమ్మెల్యేగా గెలవగా, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలవగా, రాష్ట్రంలోనూ టీడీపీనే గెలిచింది. 2004, 2009లో గజ్వేల్ ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
ఆ రెండుసార్లూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక, 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలిచి అధికారం చేపట్టడంతో పాటు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు మరోసారి సీఎం కేసీఆర్ గజ్వేల్ బరిలో ఉన్నారు.