హైదరాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): తెలుగు ప్రజల ఆశీర్వాదబలమే తనను అత్యున్నత స్థాయికి చేర్చిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. రెండు రాష్ర్టాల పర్యటన తనను పులకింపజేసిందని, పర్యటనకు సహకరించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం సీజేఐ లేఖ విడుదల చేశారు. రెండు రాష్ర్టాల ప్రభుత్వ ప్రొటోకాల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, రాజ్భవన్ అధికారులకు, యావత్తు అధికార యంత్రాంగానికి ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. పర్యటనలో తన వెంట ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల పట్ల చూపిన గౌరవం, అభిమానం శ్లాఘనీయమని అన్నారు. న్యాయవ్యవస్థ పట్ల, న్యాయమూర్తుల పట్ల తెలుగు ప్రజలు చూపిన గౌరవం చూసి వారెంతో సంతోషించారని పేర్కొన్నారు. బంధుత్వాలకంటే మిత్ర బంధానికికే పెద్దపీట వేసే పొన్నవరం ఊరంతా తరలివచ్చి, తనను కుటుంబ సభ్యులను ఎడ్ల బండెక్కించి.. పొలిమేరల నుంచే ఊరేగింపుగా తోడ్కొని పోయినవైనం కదిలించిందని వివరించారు. అడుగడుగునా దీవించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మీరు చూపిన అభిమానాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయనని మాటిచ్చారు. సమయాభావం వల్ల ఇంకా చాలామందిని కలవడం కుదరలేదని, అందరినీ కలిసే అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నట్టు సీజేఐ లేఖలో పేర్కొన్నారు.