కరీంనగర్ తెలంగాణచౌక్/ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : టీజీఎస్ ఆర్టీసీని కనుమరుగు చేయాలని సీఎం రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్లో అన్ని శాఖలకు నిధులు ఇచ్చినా ఆర్టీసీకి మాత్రం కేటాయించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీకి నిధులు కేటాయిండంలో విఫలమైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు.. ‘ఆర్టీసీ డిపోల్లో ఎల్ట్రకిక్ బస్సులు ఉండొద్దు.. ఆర్టీసీ స్థలాల్లో ఆర్టీసీ బస్సులే ఉండాలే.. మా భూములు మాకే కావాలే’ అనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఆర్టీసీ డిపోల్లో కార్మికులు నిరసన చేపట్టారు.
కరీంనగర్ డిపో -2 ఎదుట కార్మికులు చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శనలో థామస్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని, యూనియన్కు అనుమతి ఇస్తామని రేవంత్రెడ్డి వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాలన్నీ అమలు చేయడానికి రేవంత్రెడ్డి మధ్యవర్తిత్వం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేంద్ర నిధులతో ఎలక్ట్రా, జేబీఎం కంపెనీల ఈవీ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించారని పేర్కొన్నారు. ఈ బస్సులను నడిపించి లాభాలు ఆ సంస్థలకు అప్పగించడం ద్వారా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతున్నదని వాపోయారు. ఈవీ బస్సులను ఆర్టీసీ యాజమాన్యానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి బకాయి రూ.7,500 కోట్లు ఉంటే రాష్ట్ర బడ్జెట్లో కేవలం రూ.4వేల కోట్లే కేటాయించారని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ రీజినల్ చైర్మన్ ఎంపీ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.