హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ( RTC JAC ) ఈనెల 24న ఛలో సెక్రటేరియట్కు ( Chalo Secretariat ) పిలుపునిచ్చింది.
సోమవారం ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జేఏసీ నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి.మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి.యాదగిరి హాజరై మాట్లాడారు.
ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సుమారు రెండున్నర సంవత్సరాల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో పలు ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రి , మంత్రుల దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లగా హామీల అమలుకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేస్తామని, 2021 వేతన సవరణ అమలు చేస్తామని, ఆర్టీసీని విస్తరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఏ ఒక్కటీ అమలు చేయకుండా విస్మరించిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టి విపరీతమైన పనిభారాలు మోపిందని, రోజుకు 16 గంటలు బలవంతంగా డ్యూటీలు చేయిస్తూ కార్మికుల నడ్డి విరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి కార్మికులు పెద్దయెత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు సి.ఎన్.కృష్ణ, జె.రాఘవులు, ఎన్.బాల్ రెడ్డి, ఎన్.బుద్ధ విశాల్, ఎం.ఎ.మజీద్, డి.రాంచందర్, పాపయ్యగౌడ్, ము త్యాలు, రమేష్ , ప్రచార కార్యదర్శి సాయినాథ్
తదితరులు పాల్గొన్నారు.