ఎల్బీనగర్, జూన్ 12: టీజీపీఎస్సీ నియామక అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంచాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడి ్డసుధీర్రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ కోరారు. శుక్రవారం టీజీపీఎస్సీ నియామక అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని కోరుతూ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశంకు ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీజీపీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 44 ఏండ్ల నుంచి 46 ఏండ్లకు పెంచాలని కోరారు. గతంలో అమల్లో ఉన్న జీవో నంబర్ 42 ప్రకారం అభ్యర్థుల వయో పరిమితి 46 ఉండేదని, అనంతరం జారీ చేసిన జీవో 86 ద్వారా 44 ఏండ్లకు పరిమితం చేయడం ద్వారా అనేక మంది అర్హులైన అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు.
అనేక శాఖల్లో చాలా ఏండ్ల తర్వాత నియామక నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయని, ముఖ్యంగా డీఈవో, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల వంటి పోస్టులకు సుదీర్ఘ విరామం తర్వాత నోటిఫికేషన్లు వెలువడుతున్నాయని, క్రమబద్ధమైన వార్షిక నియామక క్యాలెండర్ లేకపోవడంతో పీజీ, పీహెచ్డీ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. దరఖాస్తు ఫీజును ప్రస్తుతం ఉన్న రూ. వెయ్యి నుంచి రూ. వందకు తగ్గించాలని కోరారు. టీజీపీఎస్సీ అధికారులు ఈ అంశాలు పరిశీలించి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్కుమార్, వనస్థలిపురం కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు.