హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రెండో వేతన సవరణ (పీఆర్సీ) కమిషన్ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ చేపట్టాలని టీఎన్జీవో, టీజీవో తదితర సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు గురువారం మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు. పీఆర్సీ నివేదిక వచ్చేలోగా జూలై ఒకటి నుంచి అమలులోకి వచ్చేలా మధ్యంత భృతి (ఐఆర్)ని ప్రకటించాలని, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికి న్యాయం జరిగేలా చూడాలని వారు తమ వినతిపత్రంలో విజ్ఞప్తిచేశారు.
ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు వారి చందాలతోనే ఒక ట్రస్ట్ను ఏర్పాటుచేసి మెరుగైన సేవలందించే ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)ను ప్రకటించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. రంగారెడ్డి జిల్లా గోపన్పల్లి సర్వే నంబర్- 36, 37లో ఉద్యోగులకు కేటాయించిన స్థలాన్ని భాగ్యనగర్ ఎన్జీవో హౌసింగ్ సొసైటీకి అప్పగిస్తూ ఉత్తర్వులివ్వాలని విన్నవించారు. ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలను సైతం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చినట్టు జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ వీ మమత తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసుల చిత్తశుద్ధికి, నిస్వార్థ సేవకు మరోసారి ప్రముఖుల ప్రశంసలు అందాయి. నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి తెలంగాణ పోలీసుల పనితనాన్ని ట్విట్టర్ వేదికగా అభినందించారు. ‘జూలైలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2,617 మంది చిన్నారులను రక్షించి ఆదర్శంగా నిలిచారు. 400లకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 436 మంది నిందితులను అరెస్టు చేశారు. మీకు నా అభినందనలు’ అంటూ తెలంగాణ సీఎంవో, తెలంగాణ కాప్, తెలంగాణ డీజీపీ, ఉమెన్ సేఫ్టీవింగ్ ఏడీజీ శిఖాగోయెల్ ఐపీఎస్ను ట్యాగ్ చేశారు.