హైదరాబాద్/దామరచర్ల, మే 13 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) మరో మైలురాయిని అధిగమించింది. ఈ ప్లాంట్లోని యూనిట్-3లో ఈ నెల 10 నుంచి నిర్వహించిన కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీవోడీ) బుధవారం విజయవంతంగా ముగిసింది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ను 72 గంటలపాటు నిర్విరామంగా నడిపారు. ఎలాంటి అటంకాలు, సమస్యలు లేకుండా ఈ యూనిట్ ఏకధాటిగా పూర్తిలోడ్తో నడిచింది. ఈ 72 గంటల్లో 57.60 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఏకంగా 58.525 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. దీంతో సీవోడీ విజయవంతమైనట్టు టీజీజెన్కో అధికారులు ప్రకటించారు. టీజీ జెన్కో సీఎండీ హరీశ్ బుధవారం వైటీపీఎస్కు చేరుకుని, సీవోడీని పర్యవేక్షించారు. ఆ ప్రక్రియ విజయవంతమయ్యే వరకు ఆయన ప్లాంట్లోనే గడిపారు. హరీశ్తోపాటు టీజీజెన్కో డైరెక్టర్ రాజశేఖర్రెడ్డి, సీఈ రమేశ్బాబు తదితరులు సీవోడీని పర్యవేక్షించారు. నిజానికి యూనిట్-3లో సీవోడీ కంటే ముందే విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. తాజాగా సీవోడీ ప్రక్రియ ముగియడంతో కమర్షియల్ ఆపరేషన్స్ షురూ అయినట్టే. దీంతో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ రూపంలో టీజీజెన్కో ఆదాయాన్ని సమకూర్చుకోనున్నది.
వైటీపీఎస్లో 800 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 5 యూనిట్లు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 3 యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. తాజాగా 3వ యూనిట్లో సీవోడీ విజయవంతంగా పూర్తవడంతో నాలుగు యూనిట్ల ద్వారా 3,200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పతి కానున్నది. ఇక ఈ ప్లాంట్లో మిగిలిన 5వ యూనిట్ను 3-4 నెలల్లో అందుబాటులోకి తెస్తామని టీజీజెన్కో అధికారులు తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన వైటీపీఎస్ దక్షిణ భారత దేశంలోనే రెండో అతిపెద్ద పవర్ప్లాంట్. విద్యుత్తు రంగంలో తెలంగాణ ఎవరిపై ఆధారపడకుండా మిగులు రాష్ట్రంగా నిలువాలన్న సదాశయంతో కేసీఆర్ రూ.35 వేల కోట్లతో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. మొత్తం 5 యూనిట్లు గల ఈ ప్లాంట్లో ఇప్పటికే మూడు యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 12 వరకు యూనిట్-1లో 122.64, యూనిట్-2లో 297.11, యూనిట్-4లో 276.13, యూనిట్-3లో 343.78 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేశాయి. దేశంలో కొందామన్నా కరెంట్ దొరుకని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు వైటీపీఎస్ వరప్రదాయినిగా మారింది. మార్చి నెలలో పీక్ డిమాండ్ 18 వేల మెగావాట్లు దాటినప్పుడు ఈ ప్రాజెక్టే రాష్ర్టాన్ని కారుచీకట్ల నుంచి బయటపడేసింది.
