హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థ కోసం, కార్మికుల సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటేసి టీబీజీకేఎస్ సంఘాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థను కేసీఆర్ కాపాడారని, లాభాలబాట పట్టించారని, టీబీజీకేఎస్ కార్మికుల హకులను సాధించిందని పునరుద్ఘాటించారు. కార్మికుల గొంతుక టీబీజీకేఎస్ బాణం గుర్తుపై ఓట్లేసీ భారీ మెజారిటీతో గెలిపించాలని సింగరేణి కార్మికులకు విజ్ఞప్తిచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలన్న ఉదారమైన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని తెలిపారు. కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్కే దకుతుందని వివరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణి నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిననాటికి లాభాల్లో కార్మికులకు వాటా కేవలం 18% ఉండగా, 32 శాతానికి పెంచారని గుర్తుచేశారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ దవాఖానల్లో ఉచితం వైద్య సౌకర్యం కల్పించారని, సొంత ఇల్లు నిర్మించుకునే వారికి రూ.10 లక్షల రుణం వరకు సంస్థనే వడ్డీ భరించడం, ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి విప్లవాత్మక, కార్మిక సంక్షేమ నిర్ణయాలను అమలుచేశారని వివరించారు.
కార్మికుల కోసం గతంలో ఎప్పుడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కవిత పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం టీబీజీకేఎస్ అని పేర్కొన్నారు. సంఘం నాయకత్వ బాధ్యతల్లో యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. గత పదేండ్లలో ఒక సమ్మె కూడా చేయనవసరం లేకుండా అన్ని డిమాండ్లు సాధించుకున్నామని తెలిపారు.