Vehicle Registration | వాహనాల రిజిస్ట్రేషన్కు ఉపయోగించే టీఎస్ స్థానంలో టీజీగా మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్కు వినియోగిస్తున్న టీఎస్ అక్షరాల స్థానంలో ఇకపై టీజీని వినియోగించనున్నారు. ఈ నిర్ణయంతో అందరూ అయోమయానికి గురవుతున్నారు. అందరిలో తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లో టీజీగా మార్చుకోవాలా? అనే అనుమానం తలెత్తుతున్నది. అయితే, ప్రస్తుతం ఉన్న వాహనాల నంబర్ల ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత కొత్తగా వాహనాలకు మాత్రమే టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత అప్పటి నుంచి కొత్తగా రిజిస్టేషన్ అయ్యే వాహనాలకు టీజీ కేటాయించే అవకాశం ఉంటుంది. గతంలోనూ రాష్ట్ర విభజన సమయంలోనూ ఏపీ స్థానంలో టీఎస్ మార్చుకోవాల్సిన అవసరం రాలేదు. అక్కడి రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను యథావిధిగా కొనసాగాయి. ప్రస్తుతం అదే పద్ధతి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ జీవో వచ్చిన తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే టీజీ ఉంటుందని, అలా కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఎస్ పేరుతో ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చాలంటే పెద్ద తలనొప్పిగా మారుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
లక్షల వాహనాలు ఉంటాయని, అవన్నీ మార్చాలంటే కష్టమని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే టీఎస్ నెంబర్ ప్లేట్లను టీజీగా మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు టీఎస్ నంబర్ ప్లేట్లను టీజీగా మార్చుకోవాల్సిన అవసరరం లేదని, మార్చుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని, అప్పటి వరకు వాహనదారులు ఎవరూ తమ నెంబర్ ప్లేట్లను టీజీగా మార్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.