టెహ్రాన్: ఇరాన్ సుప్రీనేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో(Ali Khameneis Funeral) ముఖానికి మాస్క్, తలకు టోపీ ధరించిన ఓ వ్యక్తి అందరి దృష్టి ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే ఆ రహస్య వ్యక్తి.. ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. ఆ వ్యక్తి మొజ్తాబా ఖమేనీ అయి ఉంటాడని తొలుత కొందరు భావించారు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి సమాచారం వెల్లడైంది. అయతుల్లా అలీ ఖమేనీ పెద్ద మనువడు అని తేలింది. మాస్క్ ధరించి ఖమేనీకి నివాళి అర్పించిన ఆ వ్యక్తి పేరు మొహమ్మద్ జావెద్ ఖమేనీ. అయతుల్లా పార్దీవదేహానికి నివాళి అర్పిస్తున్న సమయంలో జావెద్ ఖమేనీ ముందు వరుసలో ఉన్నారు. ముఖానికి మాస్క్, తలకు బేస్బాల్ టోపీ ధరించాడతను.
సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ పెద్ద కుమారుడు మొస్తాఫా ఖమేనీ కొడుకే జావెద్ ఖమేనీ. అయితే ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడిలో అతని ముఖం కాలిందని, తీవ్రంగా గాయాలు అయినట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. గాయాల వల్ల అతను తన ముఖాన్ని నల్లటి మాస్క్తో కపుకున్నట్లు తెలిసింది. ఇక అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ.. అమెరికా దాడిలో తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఓ మీడియా కథనం ప్రకారం.. మొజ్తాబా గాయాలతో ఇబ్బందిపడుతున్నాడని, దాడుల వల్ల అతని శరీరం చాలా వరకు దెబ్బతిన్నట్లు తెలిసింది. అమెరికా దాడి జరిపిన సమయంలో మొజ్తాబా కూడా తండ్రి ఇంట్లోనే ఉన్నట్లు తేల్చారు. దాడిలో మొజ్తాబా కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయని, చేతులకు కూడా ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని సైప్రస్కు చెందిన ఇరానీ అంబాసిడర్ అలీరేజా సలారిన్ పేర్కొన్నారు.
అలీ ఖమేనీ పార్దీవదేహాన్ని గురువారం ఖననం చేసిన విషయం తెలిసిందే. ఆరు రోజుల పాటు ఊరేగింపు తర్వాత ఆయన శరీరాన్ని సమాధి చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణల వల్ల సుమారు నాలుగు నెలల పాటు ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేశారు. కోల్డ్ స్టోరేజీలో ఆయన శరీరాన్ని దాచారు. స్వంత ఊరు మాషాద్లోని ఇమామ్ రేజా మసీదు వద్ద అతని శవపేటిక పెట్టారు. సుమారు 4.3 కోట్ల మంది అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్నారు.