TG High Court | కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించిన కోర్టు.. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు. ఈ మేరకు కోర్టు కేసును వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఈ భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగిన విషయం తెలిసిందే.
సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉన్న 400 ఎకరాల్లోని చెట్లను నరికి వేస్తున్నారని.. అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనాన్ని కోరారు. అయితే, పిటిషన్పై మధ్యాహ్నం 3.45కు విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు ప్రభుత్వం పనులు చేపడుతున్న స్థలాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు చెట్లను నరికివేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలుపగా.. హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని జస్టిస్ బీర్ గవాయ్ స్పష్టం చేశారు.