హైదరాబాద్: ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలకానున్న నేపథ్యంలో అభ్యర్థులకు డిజిటల్ శిక్షణనిచ్చేందుకు టీశాట్ ఏర్పాట్లు చేస్తున్నది. టెలిపాఠాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నది. గ్రూప్-1, టెట్, టీచర్ పోస్టులు, పోలీసు, వైద్యారోగ్యశాఖలోని పలు పోస్టులకు పోటీపడుతున్నవారికి ఉచిత శిక్షణనిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఏప్రిల్ 4 నుంచి ఈ శిక్షణ ప్రారంభంకానున్నది. ప్రస్తుతానికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు ఏప్రిల్ 4 నుంచి మే 4 వరకు మొత్తం 60 రోజుల పాటు 102 ఎపిసోడ్ల ద్వారా శిక్షణనివ్వనునున్నారు. ఉదయం, మధ్యాహ్నాల్లో ఒక్కో సబ్జెక్టుకు 30 నిమిషాల పాటు పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు.
త్వరలోనే గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముండడంతో ఈ శిక్షణను సైతం త్వరలోనే ప్రారంభించనున్నారు. రోజుకు రెండు గంటల పాటు గ్రూప్ -1కు శిక్షణనిచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పాఠ్యాంశాల రికార్డింగ్ చేయిస్తున్న టీశాట్ అధికారులు, నోటిఫికేషన్ విడుదలైన నాలుగు రోజుల్లోనే శిక్షణను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా అన్ని రకాల పోటీ పరీక్షల కోసం టీశాట్ 1500 గంటల నిడివి గల వీడియోరికార్డులను సిద్ధం చేసింది. నోటిఫికేషన్లు విడుదల కాగానే అవసరాన్ని బట్టి ప్రసారాలను ప్రారంభించనుంది.
తొలుత వారం పాటు ఓరియంటేషన్..
శిక్షణకు ముందు వారంపాటు ప్రత్యక్షప్రసారం ద్వారా ఓరియంటేషన్ను నిర్వహిస్తారు. సబ్జెక్టులు, సిలబస్, పరీక్షా విధానం, ప్రిపరేషన్ టెక్నిక్స్పై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తారు. ఇదంతా పూర్తిగా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఒక రోజు పరీక్షలకు సంబంధించిన సందేహాలను నివృత్తిచేస్తారు. టెట్ అభ్యర్థుల కోసం ఏప్రిల్ 1 నుంచి 7 వరకు ఓరియంటేషన్ను నిర్వహించాలని టీశాట్ వర్గాలు నిర్ణయించాయి. ఓరియంటేషన్తోపాటు ఏప్రిల్ 4 నుంచి టెట్కు శిక్షణప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
అభ్యర్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా టీశాట్ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టింది. దీంట్లో భాగంగా అభ్యర్థులకు మాక్టెస్ట్లను నిర్వహించనున్నది. గతంలో ఈ తరహా విధానం లేకపోగా, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగాలకు పోటీపడుతున్న అభ్యర్థులకు విజయవంతంగా మాక్టెస్ట్లను నిర్వహించింది. అభ్యర్థులకు ఆన్లైన్లో 100 ప్రశ్నలకు మాక్టెస్ట్ను నిర్వహిస్తారు. విద్యార్థి కోరుకున్న సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలకు మాక్టెస్ట్ను నిర్వహించి, పరీక్షా సమయం ముగియగానే ఎస్ఎంఎస్ రూపంలో ఎన్ని మార్కులు సాధించారో సమాచారాన్నిస్తారు.
అభ్యర్థులు కోరుకుంటే డిజిటల్ ప్రశ్నపత్రాన్ని వారి మెయిల్ ఐడీకి పంపిస్తారు. ఇందుకోసం టీశాట్ అన్ని సబ్జెక్ట్లకు కలిపి 50వేల ప్రశ్నలనిధి (క్వశ్చన్బ్యాంక్)ను సిద్ధం చేసింది. అభ్యర్థులు ఎన్నిసార్లైనా ఈ మాక్టెస్ట్లకు హాజరుకావొచ్చు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లోని ఈ మాక్టెస్ట్లను వెయ్యిసార్లు రాసినా పునరావృతంకాకుండా ఏర్పాట్లు చేశారు.