హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సహకార బ్యాంకులు సత్తా చాటుతున్నాయి. ఓవైపు రైతులకు అధిక రుణాలిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తూ మరోవైపు లాభాలను ఆర్జిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అత్తెసరు టర్నోవర్, లాభాలతో కొనసాగిన టెస్కాబ్, డీసీసీబీలు, ప్యాక్స్ ప్రస్తుతం తమ టర్నోవర్ను పెంచుకొని భారీ లాభాలను గడిస్తున్నాయి. గతంలో కేవలం వ్యవసాయ రుణాలకే పరిమితమైన ఈ బ్యాంకులు ఇప్పుడు తమ వ్యాపారాలను పలు రంగాలకు విస్తరించడమే ఇందుకు కారణం. 2015లో కేవలం రూ.6,307 కోట్లుగా ఉన్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) వార్షిక టర్నోవర్.. ప్రస్తుతం రూ.19,021 కోట్లకు పెరిగింది. అంటే.. గత ఎనిమిదేండ్లలో టర్నోవర్ మూడు రెట్లు పెరిగింది. దీంతో టెస్కాబ్ లాభాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. 2015లో కేవలం రూ.27.81 కోట్లుగా ఉన్న ఆ బ్యాంకు లాభం.. నిరుడు తొలిసారి రూ.100 కోట్లు దాటింది. ప్రస్తుతం రూ.133 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో టెస్కాబ్ రుణాల మంజూరు రూ.2,909 కోట్ల నుంచి రూ.8,508 కోట్లకు పెరిగింది.
రైతుల సేవలో ప్యాక్స్
రైతుల సేవలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) దూసుకెళ్తున్నాయి. రైతులకు రుణాలు ఇవ్వడంతోపాటు ఇతర వ్యవసాయ సంబంధ వ్యాపారాలు నిర్వహిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. ఈ విషయంలో ప్యాక్స్ బాధ్యతను గుర్తించి కొత్తగా 27 సంఘాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీంతో 2018-19లో 798గా ఉన్న ప్యాక్స్ సంఖ్య ప్రస్తుతం 825కి పెరిగింది. వీటిలో సభ్యులుగా ఉన్న మొత్తం 31.36 లక్షల మంది రైతుల్లో 21.63 లక్షల (దాదాపు 70 శాతం) మందికి రూ.6,706 కోట్ల రుణాలు అందజేశారు. నిరుటి వరకు రూ.148.64 కోట్ల లాభాల్లో ప్యాక్స్.. రైతులకు రుణాలివ్వడమే కాకుండా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, ధాన్యం మిల్లింగ్, డీజిల్, పెట్రోల్ అమ్మకాలు తదితర వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నాయి. తద్వారా ఇవి రూ.666 కోట్ల టర్నోవర్ సాధించడం గమనార్హం.
దేశానికే ఆదర్శంగా
రాష్ట్రంలోని టెస్కాబ్, డీసీసీబీలు, ప్యాక్స్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటు రైతులకు సేవలు అందించడంలోనూ, రుణాలు అందించడంతో పాటు సాంకేతికత వినియోగంలోనూ ముందంజలో ఉన్నాయి. దేశంలోని సహకార బ్యాంకుల్లో తొలిసారి సాంకేతికత వినియోగాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను నెలకొల్పిన రాష్ట్రంగా, అన్ని ప్యాక్స్ను కంప్యూటరైజ్ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించింది. ఈ క్రమంలో తెలంగాణలోని సహకార బ్యాంకులు అత్యుత్తమ విధానాలతో పలు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నాయి. 2020-21 సంవత్సరానికి ఉత్తమ రాష్ట్ర సహకార బ్యాంకు అవార్డును దక్కించుకున్న నాబార్డ్.. మూడుసార్లు నాఫ్కాబ్ ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును గెలుచుకున్నది. దీంతో ఇతర రాష్ర్టాల్లోని సహకార బ్యాంకుల అధికారులు తెలంగాణకు వచ్చి ఇక్కడ అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నారు.
రైతులకు ఉత్తమ సేవలందించడమే లక్ష్యం
రైతులకు, వినియోగదారులకు ఉత్త మ సేవలు అందించడమే లక్ష్యంగా టెస్కాబ్తోపాటు డీసీసీబీ, ప్యాక్స్ను మరింత బలోపేతం చేస్తు న్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వీలైనంత ఎక్కువ మంది రైతులకు సరళ పద్ధతిలో రుణాలు మంజూరు చేస్తున్నాం. ప్యాక్స్ ద్వారా ఇతర వ్యాపారాలు చేస్తూ వాటి టర్నోవర్ను, లాభాలను మరింత పెంచాం. టెస్కాబ్, డీసీసీబీల టర్నోవర్, లాభాలు కూడా గణనీయంగా పెరిగాయి.
– కొండూరు రవీందర్రావు, టెస్కాబ్ చైర్మన్