సిటీబ్యూరో, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): ‘దసరా వేడుకల్లో గ్రెనేడ్స్తో విరుచుకుపడి భారీ ప్రాణనష్టం జరిగేలా చూడాలి. ఆ ఘటనలు మతకలహాలకు దారితీసి హైదరాబాద్లో మరింత ప్రాణనష్టానికి దారి తీయాలి’ అని పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు, హైదరాబాద్లో తాజాగా అరెస్టయిన ఉగ్రవాదులకు ఆదేశాలు జారీ చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ఇంకా ఏమున్నాయంటే..
2005లో టాస్క్ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడిలో మూసారంబాగ్కు చెందిన షాహెద్ బిలాల్, అతడి సోదరుడు అబ్దుల్ జాహెద్ నిందితులు. షాహెద్ బిలాల్ పాకిస్తాన్కు పారిపోగా, జాహెద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు 2017లో వీగిపోవడంతో జాహెద్ జైలు నుంచి బయటకొచ్చాడు. జైలులో ఉన్నపుడు మాజ్తో, బయటకొచ్చిన తర్వాత సైదాబాద్కు చెందిన సమీయుద్దీన్తో పరిచయం పెంచుకున్నాడు.
చంపాపేటలోని సమీయుద్దీన్ దుకాణం వద్దకు జాహెద్ తరుచూ వెళ్తూ అతడి ఫోన్ తీసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా చాటింగ్ చేసి, తిరిగి ఫోన్ను అతడికి ఇచ్చేవాడు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ఫర్హాతుల్లా ఘోరీ, తన సోదరుడైన మాజిద్, సాదిఖ్బిన్ ఉస్మాన్లతో రోజు జాహెద్ మాట్లాడేవాడు. గతనెల 27న జాహెద్, పాకిస్తాన్లో ఉన్న హ్యాండర్లతో సంభాషణలు చేశాడు. కశ్మీర్ నుంచి మెదక్ జిల్లా మనోహరాబాద్కు హ్యాండ్ గ్రెనేడ్లు వచ్చాయని వాట్సాప్లో ఫొటోలు పంపించారు. గతనెల 29న జాహెద్, సమీయుద్దీన్, మాజ్లు నగర శివారులో ఓ హోటల్ సమావేశమయ్యారు. దసరా ఉత్సవాలను లక్ష్యంగా ఎంచుకోవడం వల్ల మారణహోమం ఎక్కువగా ఉండటంతోపాటు హైదరాబాద్లో మతకలహాలు జరిగి, మరింత ప్రాణనష్టం జరుగుతుందని ప్రణాళికలు వేసుకున్నారు. ఈ విధ్వంసాన్ని సృష్టించేందుకు పాకిస్తాన్ నుంచి రూ. 30 లక్షలు హవాల ద్వారా అందాయి.