సిద్ధిపేట : చేర్యాల మండలానికి చెందిన ఆకునూరు గ్రామం బయట పాటిగడ్డ మీద ఇక్ష్వాకులకాలానికి చెందిన శైలిలో టెర్రకోట స్త్రీ శిల్పం దొరికింది. గతంలో ఇదే స్థలంలో తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన కొలిపాక శ్రీనివాస్కు గతంలో శాతవాహనులనాటి పూసలు, కుండపెంకులు, ఇనుము చిట్టెం, జైనమతానికి చెందిన సర్వతోభద్ర జైనశిల్పం లభించాయి.
ఈ శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పరిశీలించారు. ఈ టెర్రకోట బొమ్మ తలపైనున్న ‘మకరిక’ శిరోజాలంకరణ, నుదుట చూడామణి, చెవులకు కుండలాలు, కను, ముక్కుతీరు నాగార్జున కొండ, కొండాపూర్లలో దొరికిన టెర్రకోట బొమ్మలనే పోలి ఉందని తెలిపారు. ఈ బొమ్మను పరిశీలించిన చరిత్రకారుడు, స్థపతి ఈమని శివనాగిరెడ్డి సైతం ఇక్ష్వాకుల కాలందేనని నిర్ధారించారు.