హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో పాటిగడ్డ(పాతవూరు దిబ్బ) మీద శాతవాహన, శాతవాహన పూర్వయుగాల నాటి అపురూపమైన టెర్రకోట వస్తు, శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్రబృందం క్షేత్రాన్వేషకుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. రెండు వేల ఏండ్ల క్రితమే చేర్యాలలో గొప్ప నాగరిక సమాజం, వాటి నివాసాలుండేవని వీటి ఆధారంగా తెలుస్తున్నదని బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
తలపై కిరీటం, చెవులకు పెద్ద కుండలాలు, దండరెట్టలకు అలంకారాలు, నడుమున మేఖల, అర్ధదిగంబర శిల్పం, అమ్మ విగ్రహం లభించాయని వివరించారు. గతంలో కొండాపూర్, పెదబొంకూర్, కోటిలింగాలవంటి శాతవాహన ప్రదేశాల్లో దొరికిన కంచు, టెర్రకోట బొమ్మలను ఇవి పోలి ఉన్నాయని చెప్పారు. అరచేతిలో ఇమిడే చిన్న మట్టి కదురు (ఉన్ని దారం తీసే పనిముట్టు), బంగారం, వెండి, రాగి లోహాలను కరిగించే మూస, సాంబ్రాణి, అగరు ధూపం వేసే మట్టి పాత్ర, మట్టికంచుడు, టెర్రకోట మట్టిపూసలు, చనుముకుగొట్టం(నీరు చల్లే పాత్ర), ఆకుల డిజైన్తో కుండపెంకు, సాంబ్రాణి పాత్ర అడుగు లభించినట్టు హరగోపాల్ పేర్కొన్నారు.