హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామ్రెడ్డి, కుర్మయ్యగారి నవీన్కుమార్ శుక్రవారం పదవీ ప్రమాణం స్వీకరించారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎస్ నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపారు. శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాదరావు, విప్లు ఎంఎస్ ప్రభాకర్రావు, శంభీపూర్ రాజు, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, కూసుకుంట్ల దామోదర్రెడ్డి, సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డి, శేరి సుభాశ్రెడ్డి, ఎల్ రమణ, యెగ్గే మల్లేశం, దండే విఠల్, రఘోత్తంరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, మైనంపల్లి హనుమంతరావు, అబ్రహాం, మెతుకు ఆనంద్, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా శాసనమండలి ప్రాంగణంతో పాటు పబ్లిక్ గార్డెన్ సందడిగా మారింది. డప్పు చప్పుళ్లు, ఒగ్గుడోలు విన్యాసాలతో ఆ ప్రాంతం మారుమోగింది. పబ్లిక్ గార్డెన్ గేట్ నుంచి శాసనసభ ప్రాంగణం వరకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మేడె రాజీవ్సాగర్, గజ్జెల నగేశ్, దూదిమెట్ల బాలరాజు, అల్లం నారాయణ, మంత్రి శ్రీదేవి, జూలూరు గౌరీశంకర్, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి మందా జగన్నాథం, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, బుద్ధవనం డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్, సాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి తదితరులు నూతన ఎమ్మెల్సీలకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఏవీఎన్ రెడ్డితో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.